రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన ప్రభుత్వ విజయాలను మీడియోతో షేర్ చేసుకున్నారు. ప్రభుత్వం తమ రెండో టర్మ్ జర్నీని కొత్త ఉత్సాహంతో కొనసాగిస్తోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థను పది విభాగాలుగా విభజించి పని ప్రారంభించామని గుర్తు చేశారు. మంత్రులే స్వయంగా ప్రజెంటేషన్ ఇచ్చారు, క్యాబినెట్ ముందే సమీక్ష జరిగిందనీ అన్నారు. మా 18 మంత్రుల బృందాలు అన్ని కమిషనరీలలో విడిది చేసి, జిల్లా స్థాయికి.. గ్రామ స్థాయికి వెళ్లి.. జంట చౌపాల్ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు యోగీ. ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కొత్తగా ఊపందుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని యోగీ వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇ-పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేసిన దేశంలోని మొదటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఎలా అవతరించిందో హైలైట్ చేశారు. “మేం సాంకేతికతను ఉపయోగిస్తున్నాం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం మొదటిసారిగా ఇ-పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేసాం” అని యోగి చెప్పారు.
“ఈ-విధాన్ అమలులోకి వచ్చింది. 100 రోజుల్లో శాఖ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ మంత్రుల కార్యాచరణ ప్రణాళికను ప్రజెంటేషన్ ద్వారా రూపొందించారు. 18 మంది మంత్రులు మండలాల్లో పర్యటించి 72 గంటలపాటు మకాం వేసి పనులను సమీక్షించారు. ఇది 100 రోజుల్లో పూర్తయింది” అని వివరించారు. “బుల్డోజర్లు అక్రమ ఆస్తులు, మాఫియాలపై వాటి పని అవి చేస్తోన్నాయి. బుల్డోజర్ ల కారణంగా 68700 ఆక్రమణలు, 76000 అక్రమ పార్కింగ్లు విముక్తి పొందాయి” అని తెలిపారు.
లౌడ్ స్పీకర్లను తొలగించడంపై కూడా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. “1.20 లక్షల లౌడ్ స్పీకర్లను తొలగించారు. ఇప్పుడు రోడ్లపై ప్రార్థనలు ఉండవు. ఈద్, రామనవమి కార్యక్రమాలు రోడ్డుపై జరగవు” అని యోగి తెలిపారు.