దర్యాప్తు సంస్థలను మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల విమర్శలపై బీజేపీ ధీటుగానే బదులిస్తోంది. యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థల పనితీరే దారుణంగా ఉండేదన్నారు. గుజరాత్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో నాటి సీఎం మోదీని ఇరికించాలని నాడు ఏకంగా తనపైనే సీబీఐ ఒత్తిడి పెట్టిందని ఉదహరించారు.
రాహుల్ అనర్హత వేటుపై తొలిసారి కేంద్ర హోంమంత్రి స్పందించారు. ఆయన పైకోర్టుకు వెళ్లకుండా మోదీపై నిందలు వేస్తూ కూర్చోవడమేంటని మండిపడ్డారు. తన భవితవ్యం కోసం, ప్రధాని నరేంద్ర మోదీపై నిందలు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో కోర్టు తీర్పుతో శిక్షలు పడి పదవులు కోల్పోయిన వాళ్లు చాలామంది ఉన్నారని…రాహుల్ మాత్రమే కాదని ఆయన అన్నారు. చిన్న విషయానికి అంత రాద్దాంతం చేయడం ఆపి… ఆ కేసులో పై కోర్టులో పోరాడాలని సూచించారు. చేయాల్సిన పని చేయకుండా ప్రధానిపై , కేంద్రంపై నిందలెలా వేస్తారని ప్రశ్నించారు అమిత్ షా.
రాహుల్ కేవలం ఎంపీ మాత్రమేనని…అంతకన్నా ఉన్నతపదవుల్లో ఉన్ననాయకులు సైతం ప్రజాప్రాతినిథ్య చట్టం కింద అనర్హతకు గుర్తు చేశారు. యూపీఏ హయాంలో 2013లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత. రషీద్ అల్వీ సహా 17మంది ప్రముఖ నేతలపై అనర్హత వేటు పడిందని షా తెలిపారు.
చట్టంలో పేర్కొన్న మేరకు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే దోషిగా తేలితే వెంటనే ఆటోమెటిగ్గా తన పదవి కోల్పోతారన్నారు. గతంలో ఈ చట్టం కింద పదవి కోల్పోయిన వాళ్లెవరూ ఇంత హంగామా చేయలేదని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ కు చట్టాల పట్ల అవగాహన లేకుంటే ఆపార్టీలో ఉన్న సీనియర్లు, న్యాయనిపులుణులైనా సలహా ఇవ్వాల్సిందనీ అన్నారు. ఇల్లు ఖాళీ చేయాలంటూ రాహుల్ కు వచ్చిన నోటీసులపైనా స్పందించిన కేంద్రమంత్రి… సాధారణ ప్రక్రియలో అదీ భాగమని…ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరమేం లేదని తెలిపారు.