కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పవచ్చు.
గత రెండేళ్లుగా మిలిటెంట్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 1997 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన విజయ్ ..గతంలో ఛత్తీస్ గఢ్ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. శాంతిభద్రతల విషయంలో జమ్మూకశ్మీర్లో పరిస్థితి మరింత మెరగవుతోంది. పౌరులు, పోలీసులు, జవాన్ల హత్యలూ తగ్గాయి. మిలిటెంట్ ర్యాంకుల్లోకి రిక్రూట్మెంట్లు సైతం గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది వివిధ ఉగ్రసంస్థల్లో చేరిన యువతలో 70శాతం మంది హతం కావడమో, అరెస్టవడమో జరిగాయి. ఈ సంవత్సరం భారత రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి సహా… 327 మంది పార్లమెంటేరియన్లు, 75మంది కేంద్రమంత్రులు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
సయ్యద్ అలీ గిలానీ అంత్యక్రియలు వారికో పెద్ద సవాలని చెప్పవచ్చు. అంత్యక్రియల సందర్భంగా హింసను ప్రేరేపించే కుట్రలు పన్నింది పాకిస్తాన్. లక్షల్లో పాల్గొనే యాత్రలో వందమందికిపైగా చనిపోతారనే భయాందోళనలు వ్యాప్తి చెందాయి. కానీ ఎలాంటి అల్లర్లు లేకుండానే గిలానీ ఖనన కార్యక్రమాలు ముగిశాయి. జమ్ముకశ్మీర్లో ఇంత ప్రశాంత వాతావరణం నెలకొనడానికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు ప్రజలేనని పోలీసులు, ఆర్మీ అంటున్నారు. నూరు శాతం క్రెడిట్ స్థానిక పౌరులకే ఇస్తున్నారు. అదే సమయంలో తాము ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్నామనీ అంటున్నారు.