ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రధాని నరేంద్రమోదీ దీపావళిని పురస్కరించుకుని జవాన్లతో పండుగ జరుపుకున్నారు. ఈ సారి ప్రధాని నరేంద్రమోదీ రాజస్తాన్ లోని జైసల్మీర్ లోని లోంగేవాలా పోస్ట్ లో నిర్వహించిన ఉత్సవంలో సరిహద్దు వీరులతో కలిసి మోదీ దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా మోదీ జవాన్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘జవాన్లతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి. దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చాను. మీ మధ్యలో దీపావళి జరుపుకుంటేనే నాకు దీపావళి పండగలా అనిపిస్తుంది. మీ మోముల్లో ఆనందం చూస్తే నా ఆనందం రెట్టింపు అవుతుంది. మీరుంటేనే దేశం ఉంటుంది. ’’అని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులనుద్దేశించి మాట్లాడారు. మీరు హిమాలయ శిఖరాల్లో ఉన్నా, ఎడారిలో ఉన్నా, దట్టమైన అడువులు, లోతైన సముద్రాల్లో ఇలా ఎక్కడ ఉన్నా సరే శౌర్యంతో పోరాడతారంటూ మోదీ జనాన్లను ప్రసంశించారు. ఈ లోంగేవాలా పోస్ట్ అందరికీ గుర్తుండి పోతుందని మోదీ పేర్కొన్నారు. ఇక్కడే దాయాది పాకిస్తాన్కు భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారని గుర్తు చేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో దీపావళి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని సియాచిన్ ప్రాంతంలో పర్యటించానన్నారు. సరిహద్దుల వెంట దేశం కోసం పనిచేస్తోన్న సైనికులందరి కుటుంబాలకు ఆయన కృతజ్ఞతలు తెలుపారు. వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. దేశం సురక్షితంగా ఉందంటే సరిహద్దుల్లో రక్షణగా ఉన్న సైనికులే కారణం అని అన్నారు. తీవ్రవాదంతో, ఉగ్రవాదంతో, దేశ ద్రోహులతో సైనికులు పోరాడుతూ దేశానికి రక్షణ కల్పిస్తున్నారని చెప్పారు. ఇతర దేశాలను అర్థం చేసుకోడానికే భారత్ మొదటుందని అయితే ఏ దేశమైనా సరే ఈ సిద్ధాంతాన్ని పక్కనబెడితే భారత్ గట్టిగా బుద్ధి చెబుతుందని మోదీ హెచ్చరించారు. గత ఆరేళ్లుగా 2014 నుంచి ఆయన దీన్ని అలవాటుగా మార్చుకున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
దీపావళిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా చేసి ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ప్రతిఒక్కరూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’’ అంటూ మోదీ పేర్కొన్నారు. ఆరోగ్యంతోనే వికాసమని, ఆరోగ్యమే మహద్భాగ్యమనే నినాదమే స్ఫూర్తిమంతమని పేర్కొన్నారు. ఈ రోజు ప్రజలంతా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే వీర జవాన్లకు కూడా మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దీపావళి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పండుగను కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. ఇక రామజన్మభూమి అయోధ్యలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగున్నాయి. 6 లక్షల దీపాల వెలుగులో అయోధ్య దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ దీపోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి వరకూ జరగనున్నాయి. శ్రీరాముడు సీతాసమేతంగా పుష్పక విమానంలో లంక నుంచి వచ్చిన ఘటనను లేజర్, సౌండ్ షోలో ప్రదర్శించారు. అయోధ్యలోని సాకేత్ కళాశాల నుంచి నదీతీరం వరకూ సుమారు 5 కిలోమీటర్ల పొడవున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ‘‘గడచిన 500ఏళ్లలో ఎంతోమంది సాధువులు, పుణ్యాత్ములు రామజన్మభూమిలో రామాలయాన్ని చూడాలని కలగన్నారు. ఇది చూడగలుగుతున్న మన తరం ఎంతో అదృష్టవంతులం. రామరాజ్య స్థాపనకు కృషి చేసిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు’’ అని దీపావళి ఉత్సవాన్ని ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.