తెలంగాణ లో కొన్ని రోజులు గా హైడ్రా హడావుడి నడుస్తోంది. అకస్మాత్తుగా బుల్ డోజర్లు వీధుల్లోకి వచ్చేసి ఇళ్ళను కూల్చివేస్తున్నాయి. హైదరాబాద్ వంటి చోట్ల ఏది బఫర్ జోన్, ఏది సేఫ్ జోన్ అన్నది తెలియదు. దీంతో ఎక్కడ తమ ఇళ్ళ ను కూలుస్తారో అని హడలి పోతున్నారు.
ఇదే అదను గా కొత్త ట్రెండ్ మొదలైంది. కొద్ది మంది సామాజిక కార్యకర్తల ముసుగులో బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్లను బెదిరిస్తున్నారు . ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇళ్లు కూలిపోతాయి అని వార్నింగ్ లు ఇస్తున్నారు. అలాగే అధికారులతో వున్న ఫోటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాల్సింది అని బేరాలు ఆడుతున్నారు. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడటంతో పాటు గత కొద్దికాలంగా బహుళ అంతస్తుల్లో, వ్యక్తిగత గృహల్లో నివాసం వుంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరుగుతోంది.
దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఇటువంటి బెదిరింపులు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది ఎవరైనా కూడా… హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతుంటే.. హైడ్రా కమిషనర్, ఏసీబీకి కూడా ఫిర్యాదు చేయాలన్నారు. మొత్తం మీద హైడ్రా పేరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు కూడా వస్తున్నది.