బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన తన మైనర్ బిడ్డల కోసం ఆ హిందూ తల్లి చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. శాడిస్ట్ భర్త చేతిలో ఎన్నోఏళ్లు చిత్రహింసలు భరించింది. కానీ తన బిడ్డల్ని దూరం చేయడాన్నిఆ కన్నపేగు తట్టుకోలేకపోయింది. ఒంటరిగానే అలుపెరగని పోరాటం చేసింది. న్యాయస్థానం సైతం ఆ అమ్మ ఆవేదనను అర్థం చేసుకుంది. అక్కడి రాజ్యాంగం ప్రకారం, అక్కడి చట్టాల ప్రకారం ఆ బిడ్డల హక్కు తల్లికేనని తీర్పునిచ్చింది. ఇది మలేషియాకు చెందిన 35 ఏళ్ల చైనా మహిళ లోహ్ సివ్ హాంగ్ గాథ, కాదు విజయగాథ అనొచ్చు. ఎట్టకేలకు తన పోరాటం ఫలించి… ఒడి చేరిన బిడ్డలతో ఆమె సంతోషంగా ఉంది. ఆ ముగ్గురు మైనర్ పిల్లల్ని తక్షణమే ఆమెకు అప్పగించాలని కౌలాలంపూర్ కోర్టు తీర్పునిచ్చిన మరుక్షణం ఆ తల్లి ఉద్వేగం అంతా ఇంతా కాదు.
జీవితమంతా కష్టాలు అనుభవించిన ఆ తల్లికి తన భవిష్యత్ అందంగా కనిపిస్తోంది. పదేళ్ల కొడుకు సహా…14 ఏళ్ల ఇద్దరు కవల కుమార్తెలను ఆనందంగా అక్కున చేర్చుకుంది ఆ మాతృమూర్తి. ఇప్పుడు వాళ్లకు మెరుగైన జీవితం అందించేందుకు మరో అడుగు వేస్తోంది. బిడ్డలు దూరమైన బాధను కన్నా ఇంకేదీ తనకు కష్టం కాదంటోంది.
https://twitter.com/MelGohCNA/status/1495649485623824384?s=20&t=Vtjk1Y8pXoTpRSWgsiDrWw
భారత సంతతికి చెందిన భర్త నాగస్వరన్ మురియాండీ చేతిలో ఇన్నేళ్లు నరకం చూసింది ఆ తల్లి. ఇక భరించలేక విడాకులు కోరుతూ కోర్టుకెళ్లింది. 2019లో ఇద్దరూ విడిపోయారు. భర్త కొట్టిన దెబ్బలతో గాయాలపాలైన ఆమె చాలా కాలం పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. అప్పటికే ఇస్లాంలోకి మారిన భర్త పిల్లలను తన తోపాటు తీసుకెళ్లాడు.
తన పిల్లల కోసం భర్తను ఎదిరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. “డిసెంబర్ 2019లో పిల్లల కోసం మధ్యంతర కస్టడీ పొందింది. అయితే 2020 మార్చిలో కోవిడ్ లాక్ డౌన్ వల్ల కోర్టు కేసులో జాప్యం జరిగింది. తరువాత 2021 మార్చిలో కస్టడీని మంజూరు చేస్తూ ఆర్డర్ పొందింది.
ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో… మునియాండీ తన ముగ్గురు పిల్లల్నీ పెర్లిస్ స్టేట్ కు తీసుకెళ్లి ఎన్జీవోకు అప్పగించి… వాళ్లను ఇస్లాంలోకి మార్చాడు. మైనర్లు అయిన తన పిల్లల్ని మతం మార్చడం ఏకపక్షమని వాదించింది లోహ్ సివ్ హాంగ్. అదే సమయంలో మునియాండీ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. కెలాంతన్లోని జైలుకు తరలించారు. హాంగ్ తన పిల్లల్ని కలిసే ప్రయత్నం చేయగా ఎన్జీవో నిరాకరించింది. అక్కడి నుంచి వాళ్లు కెడాలోని చిల్డ్రన్ హోంకు తరలించారు. దీంతో హాంగ్ మళ్లీ కౌలాలంపూర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 13న హాంగ్ హెబియస్ కార్పస్ మోషన్ దాఖలు చేశారు. దీంతో పిల్లలను తటస్థంగా పెర్లిస్ సంక్షేమశాఖ సంరక్షణలో ఉంచారు. ఆమె తరపున శ్రీమురుగన్ కోర్టులో వాదించారు. నజీరా నంతకుమారి అబ్దుల్లా అనే మహిళా ఇస్లామిక్ బోధకుడు తన పిల్లలను ఇస్లాంలోకి మార్చారని…లెపాస్ లోని హిదయా సెంటర్ ఫౌండేషన్లో ఉంచారని తనను కలిసేందుకూ అనుమతించలేదని కోర్టుకు విన్నవించింది.
దీంతో తల్లి అనుమతి లేకుండా పిల్లలను ఓ ఎన్జీవోలో ఉంచడానికి తండ్రికి అర్హత లేదని… కోర్టు అభిప్రాయపడింది. ప్రైవేట్ పార్టీ వాళ్లు ఆ పిల్లల్ని ఇస్లాంలోకి మార్చాలనుకోవడం దుర్మార్గమనీ వ్యాఖ్యానించింది. తద్వారా పిల్లల తండ్రి, ఆ ఎన్జీవో కన్నతల్లికి అన్యాయం చేయాలని చూశారని న్యాయవాది సైతం వాదనలు వినిపించారు.
కోర్టులో వాదనల సందర్భంగా హాంగ్ న్యాయవాది మురుగన్ వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేశాయి. తల్లికి తన కన్నబిడ్డలను చూడలేని స్థితి ఏ దేశంలోనూ ఏ తల్లికీ రాకూడదని ఆయన అన్నారు. ఆమెకేదన్నా నేరచరిత్ర ఉంటేనో లేక పిల్లల్ని చిత్రహింసలు పెడితేనో అలా చేయాలి తప్ప అకారణంగా బిడ్డల్ని దూరం చేయడం రాక్షసత్వమేనన్నారు. ఆమె నుంచి పిల్లల్ని దూరం చేయడానికి ఒక్క కారణం కూడా లేదన్నారు.
అందుకు విరుద్ధంగా మత బోధకురాలు నజీరా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తండ్రి లేనందువల్లే పిల్లల బాధ్యత తీసుకున్నట్టు చెప్పారు. తనకు ఆ పిల్లలతో ఎలా పరిచయమో చెప్పింది. తండ్రి రాకపోవడంతో వాళ్లను చూసుకునే బాధ్యత తాను తీసుకున్నానని…అంతే తప్ప తల్లి నుంచి పిల్లలను వేరు చేసే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చిందామె.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి హాంగ్ పోరాటం, విజయానికి ఎం ఇందిరాగాంధీ కేసులో ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పు మూలమని, అది ఆమెకు ధైర్యాన్నిచ్చిందని చెప్పవచ్చు. కె పద్మనాభన్ అనే హిందువు 2009 మార్చిలో ఇస్లాంలోకి మారి మహ్మద్ రిదువాన్ అబ్దుల్లాగా పేరు మార్చుకున్నాడు. అదే ఏడాది ఏప్రిల్ 2న తన ముగ్గురు పిల్లలను కూడా ఇస్లాంలోకి మార్చాడు. హిందువు అయిన ఆ పిల్లల తల్లి ఇందిరాగాంధీకి ఆ విషయం చెప్పనుకూడా లేదు. ఆమె అనుమతి లేకుండానే పిల్లల్నీ మతం మార్చాడాతండ్రి.
భర్త నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇందిర కోర్టుకెళ్లారు. 2013లో తీర్పునిచ్చిన ఇపో హైకోర్టు ఇందిర ముగ్గురు మైనర్ పిల్లలైన దర్శిని, కరణ్ దినేష్ ,ప్రసన దీక్షల మార్పిడి ధృవీకరణ పత్రాలు చెల్లవని… మత మార్పిడికి తల్లిదండ్రులిద్దరి అనుమతి తప్పనిసరని తేల్చింది. అయితే ఇస్లాంలోకి మార్పిడికి సంబంధించి సివిల్ కోర్టులకు అధికారం లేదంటూ అప్పీలుకెళ్లారు. ఓ వ్యక్తి ముస్లిమా, కాదా అనేది షరియా కోర్టు ద్వారా మాత్రమే నిర్ణయిస్తుందని అప్పీల్ కోర్టు తీర్పునిచ్చింది. ముగ్గురు పిల్లల మతమార్పిడి విషయంలో షరియాకోర్టుల ప్రత్యేక అధికార పరిధిని హైకోర్టు ఉల్లంఘించిందని పేర్కొంది. పెద్దమ్మాయికి 18 ఏళ్లు పూర్తైనందున ఆమె మతాన్నినిర్ణయించేహక్కు ఉందని…ఇద్దరు చిన్నకుమారులకు మాత్రమే చిన్నపిల్లలకు కోర్టు ఉత్తర్వు వర్తిస్తుందని పేర్కొంది.
https://twitter.com/AWAMMalaysia/status/1494590113606934533?s=20&t=6ZV8NXXWXA96atNPL5Al8A
దీంతో ఇందిరా మలేషియా అత్యున్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. 2018లో అప్పీల్ కోర్టు ఆర్డర్ను కొట్టివేసింది. మైనర్ల మత మార్పిడికి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా తీసుకోవాలని కోర్టు అంది. పేరెంట్ అనే పదానికి అర్థం తల్లిదండ్రులిద్దరూ అని ..కన్నవాళ్లిద్దరికీ సమాన హక్కులుంటాయని పేర్కొంది.
ఆర్టికల్ 12 (4)లో పేర్కొన్న “PARENT” అనే పదంపై చాలా కాలంగా ఉన్న వివాదాన్ని ఫెడరల్ కోర్ట్ పరిష్కరించింది. తల్లిదండ్రుల్లో ఒక్కరి సమ్మతం సరిపోదని…మలేషియా ఫెడరల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 12(4) ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్లు మతం మారాలంటే తల్లిదండ్రులిద్దరూ ఒప్పుకోవాలని గుర్తు చేసింది.
https://twitter.com/fmtoday/status/1493580518645846016?s=20&t=vSqwrAQHK8U_OlYemg98bA
ఇక తాజా హాంగ్ కేసులో కూడా అదే పరిష్కారం లభించింది. దీంతో తన ముగ్గురు పిల్లల పోషణకోసం ఫుడ్ ట్రక్ వ్యాపారాన్ని మొదలుపెట్టాలనుకుంటోంది హాంగ్. ప్రస్తుతం ఆమె జెంటింగ్ హైలాండ్స్లోని ఒక హోటల్లో అసిస్టెంట్ చెఫ్గా ఉద్యోగం చేస్తోంది. ‘నాకు వంటఇష్టం. నేను కోర్సు కూడా చేశాను. ముందు కామెరాన్ హైలాండ్స్ సమీపంలోని దుకాణంలో ఒక స్టాల్ అద్దెకు తీసుకోవాలనుకున్నాను. అప్పుడు కుదర్లేదు. ఇప్పుడు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసి వేర్వేరు ప్రదేశాల్లో అమ్ముకుంటాను. నా పిల్లలు బతికించుకోవడానికి, చదివించడానికి నేనిప్పుడు సంపాదించాలి. వాళ్లను యూనివర్సిటీ వరకు పంపించాలి’ అంటూ ఉద్వేగంతో చెప్పింది హాంగ్ మలేషియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.
తన ఇద్దరు కుమార్తెలు ఒకరు లాయర్, మరొకరు పోలీస్ కావాలనుకుంటున్నారు. పదేళ్ల కొడుకేమో డ్రోన్ ఆపరేటింగ్, రిపేరింగ్ లపై ఆసక్తి ఉందని వాళ్లనుకుంటున్నట్టు తీర్చిదిద్ధుతానని ధృడంగా ముందడుగు వేస్తోంది హ్యాంగ్. తన పిల్లలకోసం అలుపెరుగని పోరాటం చేసి వాళ్లను దక్కించుకున్న హాంగ్ కథ నిజంగా ఎందరికో స్ఫూర్తి, ప్రేరణ.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)