ఓ జంట వినూత్నంగా విమానంలో పెళ్లిచేసుకుంది. అయితే నిబంధనలు పాటించక చిక్కుల్లో పడింది. ఈ తంతుకోసం వాళ్లు బుక్ చేసుకున్న స్పైస్ జెట్ సంస్థపైనా విమర్శలు. తమిళనాడులోని మధురైకి చెందిన ఓ జంట తమ పెళ్లిని కనీవినీ ఎరుగని రీతిలో చేసుకోవాలనుకుంది. పిల్లల ముచ్చట పెద్దలు కాదనలేకపోయారు. వారు కోరుకున్నట్టు స్పైస్ జెట్ చార్టర్ ఫ్లైట్ ను బుక్ చేసేశారు. అనుకున్న ముహూర్తానికి మధురై నుంచి బెంగళూరు వెళ్తూ గాల్లో తేలుతుండగా వధువు మెడలో తాళికట్టాడు పెళ్లికొడుకు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆనందంగా షేర్ చేశారు. అసలే దేశవ్యాప్తంగా కరోనా విజృంభన. కానీ వాళ్లు మాత్రం ఎక్కడా కరోనా నిబంధనలే పాటించలేదు. అతిధులు కిక్కిరిసి కనిపిస్తున్నారు. వాళ్లంతా చుట్టుముట్టి ఉండగా…మాస్కులు కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లనుంచి విమర్శలు వచ్చాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ దృష్టికీ విషయం వెళ్లింది.దీంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి అద్దెకిచ్చిన స్పైస్ జెట్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కరోనాకాలంలో నిబంధనలు పాటించకుండా ఈ తంతేంటంటూ విచారణకు ఆదేశించింది. అంతే కాదు విమానంలోని స్పైస్ జెట్ సిబ్బందినీ విధుల్లోంచి తొలగించారు. అంతే కాదు… నిబంధనలు పాటించకుండా విమానం ఎక్కిన పెళ్లి బృందంపై ఫిర్యాదు చేయాలంటూ స్పైస్ జెట్ ను డీజీసీఏ ఆదేశించింది.
https://twitter.com/ani_digital/status/1396783103310372864?s=20