ఈ మాటతో చాలామంది ఏకీభవించారు. అయితే ఒకరి దృష్టిలో ఉన్న విషయాలు మరొకరి దృష్టిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఏ విషయమూ తమ దృష్టికి రాకుండా ఉండకూడదనే దృష్టితో కావచ్చు వాటిని దండగుచ్చాల్సిందిగా మిత్రులు కోరు తున్నారు. అయితే నాకూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఏదీ వదిలిపెట్ట కూడదని ఒక వంద వ్రాయ కూడదు. ఏకాభిప్రాయం ఉండాలిగదా, అని ఒకటి రెండింటితోనే సరిపెట్టకూడదు. స్థూలంగా ఏకాభిప్రాయం కుదిరే కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తాను.
మొదటి విలన్ స్థానంలో మీడియా:
హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరించాల్సిందే. అలాగని భయోత్పాతం తెచ్చిపెట్టకూడదు. కాని ఇప్పుడు తెలిసో తెలియకో,పోటీలో వెనుకబడి పోతామేమోనన్న భయంతోనో చాలా పత్రికలు, టీవీ చానళ్లూ భయోత్పాతాన్ని వ్యాపింప జేస్తున్నాయి. రోగులకు చికిత్స అందటమనేది ఆసుపత్రులలో పడకలు, వెంటిలేటర్లద్వారా ఆక్సిజన్ సరఫరాల మీదనే ఆధారపడిఉంటుందనే అభిప్రాయం వ్యాపింప జేస్తున్నాయి. ఈ వాతావరణ ప్రభావం ఎటువంటిదంటే, డాక్టర్ల జ్ఞానమూ, అనుభవమూ అప్రధానమై పోయి, “వచ్చినవాళ్లనందరినీ పడుకో బెట్టి ఆక్సిజన్ మాస్క్ తగిలించాల్సిందే. అలా చేయక పోతే సమయానికి తగిన చికిత్స చేయలేదని రోగి బంధువులు తగాదాకు దిగుతారు” అనే భయానికి లోనై వ్యవహరిస్తారు. మొత్తం కంగాళీ! ఎవరికి ఏవిధమైన చికిత్స జరగాలో ఆవిధంగా జరగదు. ఏదేదో జరుగుతుంది. మందులు, వేక్సిన్లూ, ఇతర ఉపకరణాలూ, సదుపాయాలూ వృధాగా వ్యయమౌతాయి. అనేకులకు ఇల్లు గుల్లవుతుంది. అప్పుల పాలవుతారు. దేశ ఆర్థిక వ్యవస్థ తలక్రిందు లవుతుంది. ఈ పాపం ఎవరి పద్దులో వేయాలి అనే ప్రశ్నకు మీడియా పద్దులోనే అనిచెప్పుకోక తప్పని స్థితి ఏర్పడింది.
రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియత:
జన ప్రియమైన కొన్ని పథకాలను అమలుపరచి, మంచివాళ్ల మనపించుకొని మళ్లీ అధికారంలోకి రాగలగాలి అనేదృష్టితో, పేద, దిగువమధ్యతరగతి, బలహీనవర్గాల ప్రజలను ఆదుకొంటున్నట్లుగా నటించటం తప్ప చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టుదల తో అమలుచేస్తున్న ప్రజోపయోగకరమైన పనులు ఏవీ ఉండటం లేదని ప్రజలకు అర్థమైంది. గతంలో అమ్మకం పన్ను వంటి పన్నులు ఉండిన రోజులలో వాటిని వసూలు చేసుకోవటం రాష్ట్రప్రభుత్వాల బాధ్యతగా ఉండేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలకు వసూళ్ల గురించిన చింత లేదు. కేంద్రమే పన్నులు వసూలుచేసి రాష్ట్రం వాటా పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తున్నది. ఇవిగాక కొన్ని గ్రాంట్లూ ఇస్తున్నది. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగంద్వారా పంచబడగలవనే ఉద్దేశ్యంతో ఆహారధాన్యాలు, పప్పులు, నూనెల వంటివీ ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత బాధ్యతగా వాటిని అర్హులైనవారికి అందజేస్తున్నవో మనకు అనుభవంలో ఉన్నవిషయమే. బియ్యం, గోదుమలవంటివి బ్లాక్ మార్కెట్ కి, విదేశాలకు ఎగుమతికి చేరవేయబడుతున్నవనే వార్తలు వింటున్నాం. మొత్తం మీద రాష్ట్రంలో శాసనసభ్యుల ఎన్నికలకు, ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణకూ ఎంత వ్యయపరుస్తున్నామో అంత ప్రయోజనం ఉంటున్న దా అన్న సందేహం చాలామందికి కలుగుతున్నది.
విదేశాలు మనను చూసే దృష్టిలో వచ్చిన మార్పు:
కాంగ్రేసు పాలనలో ఉండగా మనమంత్రులు అనేకమంది విదేశాలను సందర్శిస్తూ ఉండేవారు. మనవాళ్లు వస్తున్నారంటే, సహాయమో , అప్పో అడగటం కోసమే వాళ్ళు వస్తున్నారనే అభిప్రాయం వివిధ దేశాలవారికి ఉండేది. ఇప్పుడు ఆ అభి ప్రాయం పూర్తిగా చెరిగిపోయింది. భారతదేశం తన కాళ్లపై తాను నిలబడుతుంది. తనకు కావలసిన వాటిని పండించుకొంటుంది, తయారుచేసుకొంటుంది. తన దగ్గర లేనివాటిని సమకూర్చుకొనడానికి ఇచ్చి పుచ్చుకొనేతీరులో దర్జాగా మాట్లాడి సాధించు కొంటుంది. బ్రతిమిలాటలు, సాగిలపడటాలూ ఉండవు. అనేది అందరికీ అర్థమైంది. తమ ఔద్ధత్యాన్ని ప్రదర్శించుకొంటూ వేక్సిన్ల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల ఎగుమతిని ఆపేస్తా మని అమెరికా ప్రభుత్వం ప్రకటించినపుడు భారత ప్రభుత్వంనుండి వేడికోళ్ళేవీ అమెరికా ప్రభుత్వాధి నేతలకు రాలేదు. భారతదేశం నుండి రావలసిన దిగమతులు ఆగిపోతే మన పరిశ్రమలు మూతబడే స్థితి ఏర్పడుతుందని అమెరికాలోని పెద్దలే వారికి తల అంటేశారు. భారతదేశం తన్నులుతింటూ పడి ఉండే దేశం కాదని, అది చైనాను, అమెరికాను ధిక్కరించి నిలబడగల సత్తాగలదేశమని, భారత దేశంతో మంచిగా ఉండాలేగాని, చిన్న చూపు చూడ దగదనీ వివరించారు. వారికి జ్ఞానోదయమై తమ వైఖరిని సరిదిద్దుకొంటూ సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే 24 గంటలలోపలే మళ్లీ ప్రకటన ఇవ్వ వలసి వచ్చింది.
మనం వైద్యం చేయించుకొంటున్నపద్ధతి లాభార్జన పట్ల ఆసక్తిగల పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా తయారైనదని, రీ ఇంబర్స్ మెంట్ పేరుతో ప్రభుత్వం ఇచ్చేదికూడా పూర్తిగా సద్వినియోగం కావటంలేదని, ఆసుపత్రులలో సౌకర్యాలు పెంచడానికై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఎంత శ్రద్ధగా, ఎంతవేగంగా వ్యవస్థల నిర్మాణానికి వినియోగింప బడాలో , ఆవిధంగా జరగటంలేదని అవగాహన పెరిగింది. కాబట్టి వైద్యము, చికిత్సా విధానాల గురించి, వ్యవస్థలగురించి అనతికాలంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగి, అల్లోపతి వైద్యశాలల స్థానంలో దేశీయ వైద్య విధానాలకు ఆదరణ పెరిగే సూచనలు కనబడుతున్నాయి. గృహవైద్యం, వంట ఇంటి వైద్యం, బలవర్ధకమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పాదనల వినియోగం, ఆహార విహారాలలో మార్పుల గురించికూడా పెద్ద ఎత్తునఆలోచనలు మొదలయ్యాయి.
మనం ధనవ్యయానికి వెనుకాడకుండా,పిల్లలను వృద్ధిలోకి తీసుకొని వచ్చే ఆలోచనతో ఎటువంటి విద్యాలయాలను పోషిస్తున్నామో,వాటిలోని డొల్ల తనమూ అర్థమౌతున్నది. ఇక్కడా ప్రత్యామ్నాయాల అన్వేషణ ఆరంభమైంది.
మొత్తంమీద పైమెరుగులకై ఆరాటపడే ధోరణినుండి అంతర్గతంగా బలమైన వ్యవస్థల నిర్మాణం జరగాలనే ఆలోచన వివిధ వర్గాల ప్రజల్లో మొదలైంది. ఉత్తరోత్తరా ఇదిమరిన్ని మంచి ఫలితాలకు దారినివ్వగలదని ఆశిద్దాం.
-వడ్డి విజయసారథి