భారత్ చైనా సరిహద్దుల్లో భారీ కుట్ర బట్టబయలు అయింది తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో చైనా నుంచి సరిహద్దులు దాటి భారత్ లోకి వస్తున్న అక్రమార్కులు దొరికిపోయారు. వాళ్ల దగ్గర 100 కిలోలకు పైగా బంగారాన్ని సైన్యం పట్టుకుంది. దేశంలోకి బంగారాన్ని పంపించి దాని సహాయంతో దుర్మార్గాలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిర్ధారణ అయింది. విదేశాల నుంచి మన దేశంలోకి కరెన్సీ పంపించడం కుదరదు కాబట్టి బంగారం ద్వారా ఘోరాలు చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు భావిస్తున్నారు.
దీనిమీద సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఐటీబీపీ తూర్పు లద్దాఖ్లోని సదరన్ సబ్సెక్టార్లో లాంగ్రేంజ్ పెట్రోలింగ్ చేస్తోంది. చిస్ములీ, నర్బులా టాప్, జాక్లే అండ్ జాక్లా ప్రాంతాల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. అందువల్ల ఆ పరిసరాల్లో నిఘా ముమ్మరం చేసాం. ఆ క్రమంలో జులై 9 మధ్యాహ్నం సిరిగాప్లే వద్ద స్మగ్లింగ్ జరుగుతోందని సమాచారం లభించింది. మా పెట్రోలింగ్ టీమ్ అక్కడకు చేరుకుంది. జులై 9 అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఇద్దరు వ్యక్తులు గాడిదల మీద ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. పెట్రోలింగ్ పార్టీ వారిని అదుపులోకి తీసుకుని క్యాంపింగ్ ఏరియాకు తరలించింది. వారి దగ్గర పెద్దమొత్తంలో బంగారం, ఇతర వస్తువులు లభించాయి. వారిని కస్టడీలోకి తీసుకుని, ఆ వస్తువులను సీజ్ చేసాం’’ అని ఐటీబీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఈ కేసు మూలాలను బయటకు తీసేందుకు సైనిక బలగాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
అరెస్ట్ అయిన టెంజిన్ టార్జీ , సెరింగ్ చంబా అనే ఇద్దరు వ్యక్తులూ భారతీయులే. వారిని, వారి దగ్గర సీజ్ చేసిన బంగారాన్నీ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
108 కేజీల బంగారు కడ్డీలతో పాటు వారి దగ్గర రెండు మొబైల్ ఫోన్లు, ఒక బైనాక్యులర్స్, టార్చ్, కొండలను తవ్వే పరికరాలు, కొన్ని చైనీస్ ఆహార పదార్ధాలూ లభించాయి. కస్టమ్స్ విభాగం అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించింది.
చైనా నుంచి దొంగతనంగా తీసుకుని వస్తున్న బంగారం సహాయంతో భారీ కుట్రకు తెర తీసినట్టు సైన్యం భావిస్తోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని నిర్ణయించారు.