శ్రీ సరస్వతీ విద్యాపీఠం (విద్యా భారతి తెలంగాణ) ఆధ్వర్యంలో సామాజిక సమరసత దిశగా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాదు శారదా ధామం లోని శిక్షణా కేంద్రంలో కర్మ చారీలకు రెండు రోజుల వర్గ నిర్వహించింది. విద్యా పీఠం భాగ్యనగర్ విభాగ్ పాఠశాలలకు చెందిన సుమారు 70 మందికి పైగా కర్మచారీలు హాజరయ్యారు. పాఠశాలల కార్యకర్తలు, సహాయకులతో కలుపుకుని వంద మందికి పైగా ఈ శిబిరానికి విచ్చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాలయాల నిర్వహణలో ఆచార్యులు, కార్యాలయ సిబ్బందితోపాటు కర్మ చారీల పాత్ర కూడా ముఖ్యమని తెలియజేశారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు దాటింది అని ఆయన గుర్తు చేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని వర్గా ల ఉద్యోగులు, కార్యకర్తలు పాలుపంచుకున్నారని ఆయన అన్నారు.
రెండో రోజు కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి ఆయాచితుల లక్ష్మణరావు, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతిరావు మాట్లాడారు. సామాజిక సమరసతకు విద్యాపీఠం పెద్ద పీట వేస్తుందని వివరించారు. అన్ని వర్గాల ఉద్యోగులు కలిసికట్టుగా నడిస్తేనే విద్యాలయాలు విజయవంతం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల్లో శుచి శుభ్రతను నిర్వహించే నాలుగో తరగతి ఉద్యోగులను పిలిపించారు. ఆయాలు, అటెండర్లను దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా సత్కారం చేశారు. అందరూ కలిసి అదే ప్రాంగణంలో సహపంక్తి భోజనాలు చేశారు. కర్మ చారీలకు కొత్త వస్త్రాలు పెట్టి గౌరవంగా సాగనంపారు. విద్యాపీఠం విలువల పట్ల అవగాహన కల్పించారు. ఆటపాటలు నిర్వహించి మనమంతా ఒకటే అన్న భావన కల్పించారు.
ఈ కార్యక్రమంలో
భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి విరివింటి రవీంద్ర శర్మ , భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు పరమానంద బన్సల్ జీ , భాగ్యనగర్ జిల్లా కార్యదర్శి గంగాధర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ అమరేందర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి దశరథ్, శైక్షణిక్ ప్రముఖ్ కాసోజు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.