హైదరాబాద్ నగరంలో అడవి అంటే నమ్మటం కష్టమే. కానీ ఇది నిజంగానే నిజం. ఈ అడవిలో ఒక రాత్రి అంతా ఉండిపోవచ్చు. చిమ్మ చీకట్లో చక్కర్లు కొట్టొచ్చు. కొండలు ఎక్కుతూ సందడి చేయొచ్చు. తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.
హైదరాబాదులోని మెహదీపట్నం నుంచి చిలుకూరు వెళ్లే దారిలో పోలీస్ అకాడమీ కనిపిస్తుంది. ఈ పోలీస్ అకాడమీ వెనుక భాగంలో చాలా అటవీ భూమి ఉన్నది. దీనిని ప్రభుత్వ అటవీ అభివృద్ధి సంస్థ ఒక ట్రెక్కింగ్ పార్కుగా మార్చింది. ఒక రాత్రంతా అడవిలోనే ఉండే అవకాశం కల్పిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇక్కడికి చేరుకుంటే ఆదివారం ఉదయం దాకా అడవిలోనే ఉండి వెళ్లవచ్చు.
అడవిలోకి ప్రవేశించగానే ఊడల మర్రి దగ్గర కూర్చోబెడతారు. అక్కడ ఈ రాత్రి క్యాంపు విశేషాలు అన్నీ అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తారు. అక్కడ చెక్ డాం దగ్గరికి వెళ్తే చల్లగా పరుగులు తీస్తున్న నీటి జలపాతాలు చూడొచ్చు. అక్కడ టెంట్లు వేయడం ఎలాగో ఉద్యోగులు నేర్పిస్తారు. ఆ సూచనలతో మనమే టెంట్ వేసుకుని గుడారం రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ భోజనాలు చేసి అడవిలోకి ప్రయాణం మొదలుపెట్టొచ్చు. చేతిలో ఒక లాంతరు ఇచ్చి చీకట్లో కిలోమీటర్ దూరం నడిపిస్తారు. చిమ్మ చీకట్లో,, కీచురాళ్ల సౌండ్స్ మధ్య అడవిలో నడక గమ్మత్తుగా ఉంటుంది. అక్కడ అడవి మధ్యలో క్యాంప్ ఫైర్ పెట్టుకోవచ్చు. గ్రూపులుగా విడిపోయి మంట వేసుకొని దాని చుట్టూ పాటలు పాడుతూ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేయవచ్చు. అర్ధరాత్రి దాకా హాయిగా ఎంజాయ్ చేశాక, మన గుడారాల దగ్గరికి వచ్చి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు.
ఉదయం ఐదు గంటలకి అసలు స్టోరీ మొదలవుతుంది. అందర్నీ నిద్రలేపి టీ తాగాక కొండ ఎక్కడం మొదలవుతుంది. అక్కడకు ఈలోగా కొందరు పక్షుల ప్రేమికులు ,, శాస్త్రవేత్తలు తోడవుతారు. మనకు బైనాక్యులర్స్ ఇచ్చి దూరంగా ఉండే పక్షుల్ని కొండల్ని పరిచయం చేస్తారు. ఈ చుట్టుపక్కల అడవుల్లో సుమారు 250 పక్షి జాతులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని హాయిగా ఫోటోలు తీసుకోవచ్చు. పురి విప్పిన నెమళ్ళు అనేక సంఖ్యలో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొండ నుంచి కిందకి తీగలు కట్టేసి ఉంటాయి. నడుముకి తాడు కట్టు కుని సైనికులు మాదిరిగా తీగ పట్టుకుని వేల్లాడుతూ కిందకు జారిపోవచ్చు. ఈ సాహసం చేస్తున్నప్పుడు .. అరుపులు కేకలతో కొండ ప్రాంతం మారుమోగటం ఖాయం. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేసుకుని అందరూ గ్రూప్ ఫోటోలు దిగి ఇంటికి వెళ్ళిపోవచ్చు.
హైదరాబాదులోని అడవి ఎక్స్ పీరియన్స్ కలిపించేందుకు ప్రభుత్వ అటవీ అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. ఆన్లైన్ ద్వారా ముందుగానే టికెట్లు తీసుకుని ఇక్కడికి చేరాల్సి ఉంటుంది. అన్ని ఖర్చులు కలిపి మనిషికి 18 వందలు చార్జ్ చేస్తారు. స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్ టీమ్ లకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వ అటవీ అభివృద్ధి సంస్థ వారి వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అడవి ప్రయాణాన్ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఆల్ ది బెస్ట్.