మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కోలార్ లో తన కుమార్తె మొదటి పుట్టిన రోజు నాడు ఆంచల్ గుప్తా అనే ఓ పానీపూరీ వ్యాపారి లక్షకుపైగా పానీపూరీలను ఉచితంగా పంచిపెట్టాడు. తన గారాలపట్టి జన్మదినం సందర్బంగా లక్షా ఒక వెయ్యి పానీపూరీలను ఉచితంగా పంపిణీ చేశాడు. ఇందుకోసం స్టాల్ల్స్ కూడా ఏర్పాటు చేశాడు. ఈ విషయం సీఎం వరకూ వెళ్లడంతో ఆయన ప్రశంసలు కురిపించారు. తానుండే ప్రాంతంలోని ఓ బహిరంగ ప్రదేశంలో టెంట్ వేసి 21 స్టాల్స్ ను ఏర్పాటు చేసి అతిథులకు పానీపూరీలు అందజేశాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యేను కూడా ఆహ్వానించారు. గతేడాది కూతురు జన్మించినపుడు కూడా ఇలాగే పానీపూరీలు అందించాడు. ప్రధాని మోదీ చేపట్టిన ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని ఆంచల్ చెప్పాడు.