నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పెద్దఎత్తున జరిగిందని పోలీసులు నిర్థారించారు. దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ ఆదేశాలమేరకే సామాజిక కార్యకర్త తీస్తాసెదల్వాద్ ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి అయిందని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వవద్దని గుజరాత్ పోలీసులు కోర్టును కోరారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్ల సమయంలోనే ఈ కుట్ర జరిగినట్టు కోర్టుకు తెలిపారు. ఈమేరకు గుజరాత్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పాటైన మోదీ సర్కారు కూలదోసేందుకు తీస్తా భారీ కుట్రకు పథకరచన చేశారని తెలిపింది. అందులో భాగంగా ఎందరో అమాయక యువకులను ఇరికించి వారి జీవితాలు నాశనం చేశారని…తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాపింపచేశారని అందుకు ప్రతిఫలంగా కాంగ్రెస్ నుంచి ఆమెకు అవార్డులు,రివార్డులు, ఆర్థికసాయాలు. ఇతర ప్రయోజనాలు దక్కాయని పేర్కొంది.
అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు తీస్తా సెతల్వాద్ కుట్రను అమలు చేసినట్లు ఓసాక్షి ఇచ్చిన వాంగ్మూలాన్ని సిట్ అందుకు జతచేసింది.పటేల్ నుంచి ఆమెకు ఏకంగా 30లక్షల నగదు ముట్టిందని పేర్కొంది.
నాటి అల్లర్లకు సంబంధించి మోదీకి గతనెలలోనే కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన ఎంపీ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన కోర్టు..నాటి అల్లర్లపై వివాదం నిత్యం రగులుతూ ఉండాలని కుట్రలో భాగంగానే పదే పదే పిటిషన్లు వేస్తున్నారని మండిపడింది. 2006 నుంచి దురుద్దేశపూర్వకంగా ఇటువంటి పిటిషన్లను దాఖలు చేశారని గుర్తు చేసింది. కోర్టు ఈ తీర్పునిచ్చిన మరునాడే తీస్తా సెతల్వాద్తోపాటు గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్లను గుజరాత్ సిట్ అరెస్టు చేసింది. తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం తదితర నేరాలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తీస్తా సెతల్వాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సిట్ తిరస్కరించింది. ఆమెను బయటకు పంపితే…సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని…విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సాక్షాత్తూ ప్రభుత్వాన్నే కూల్చేందుకు కుట్రపన్నిన వ్యక్తిని సామర్థ్యాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదనీ అంది.
ఆ సమయంలో ఓ కాంగ్రెస్ సీనియర్ నేతతో తీస్తా మాట్లాడిన మాటల్ని ఓ సాక్షి తన వాంగ్మూలంలో తెలిపారు. దీన్ని సిట్ అఫిడవిట్ కు జతచేసింది. రాజ్యసభ సభ్యత్వం కోసం కాంగ్రెస్ పార్టీ తనను ఎందుకు ఎంపిక చేయడం లేదని, షబానా అజ్మీ, జావేద్ అక్తర్లకు మాత్రమే ఎందుకు అవకాశాలు ఇస్తోందని ఆ నేతను తీస్తా అడిగినట్లు ఆ సాక్షి చెప్పినట్టు సమాచారం. అడిషినల్ సెషన్స్ జడ్జి డీడీ ఠక్కర్ సిట్ సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.