2// Godrej wonders
ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన వాళ్లు అంటే సాధారణంగా మనందరికీ రాజకీయ నాయకులు, కొంతమంది ఉన్నతాధికారులు గుర్తొస్తారు. కానీ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పారిశ్రామికవేత్తలు కూడా అంతే ముఖ్యం.
నిజానికి మన తెలుగు సినిమాలు పుణ్యమా అని పారిశ్రామికవేత్త లేదా వ్యాపారి అంటే ఒక విలన్ రూపమే మనకు గుర్తొస్తుంది. లాభాల కోసం సమాజాన్ని ప్రజల్ని దోచుకు తింటారని.. లాభాలు పిండేసుకుంటారని మనకి ఒక భావన ఉంది. కానీ తన కుటుంబం కోసం లాభాలు తీసుకుంటూ మరెన్నో కుటుంబాలని బతికిస్తారు అన్న ఆలోచన మాత్రం రానేరాదు. అది ఒక రకమైన దురదృష్టం.
…
అక్షరాల 40వేల మంది ఉద్యోగులు. అంటే ప్రతి నెల ఠంఛన్ గా 40 వేల కుటుంబాలకి జీతాలు ఇవ్వడం అన్నమాట. సుమారుగా లక్షన్నర మందిని పోషించడమే. మనదేశంలో పేరు ఎన్నిక గన్న గోద్రెజ్ సంస్థ చేస్తున్న పని ఇది. గోద్రెజ్ కంపెనీ లాభాలు సంస్థ యజమానులకే చెందుతాయి అందులో అనుమానం లేదు కానీ 40 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, లక్ష కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించడం అనేది మామూలు విషయం కాదు. ప్రతి నెల ఒకటో తారీకు జీతాలు పంపించడం తమ మొదటి పని అని గోద్రెజ్ కంపెనీ కి సుదీర్ఘకాలం చైర్మన్ గా వ్యవహరించిన సోహ్రాబ్ గోద్రెజ్ అంటారు. జూన్ నెల మూడో తేదీ సోహ్రాబ్ జయంతి. అందుచేత గోద్రెజ్ ప్రస్థానం ఏంటి, ఇన్ని వేల కుటుంబాలకి అన్నదాతగా ఎలా మారింది అనే విషయాలు తెలుసుకుందాం.
….
18 95, 97 సమయానికి భారతదేశంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇప్పటి యువతకు చెబితే నవ్వుకుంటారు కానీ అప్పట్లో భారతీయుల దగ్గర తాళం కప్పలు,, తాళం చెవులు లేనే లేవు. తలుపులకు అవి ఇవి అడ్డం పెట్టుకుని బయటకు వెళ్లే పరిస్థితి. ఆంగ్లేయుల దగ్గర మాత్రమే ఐరోపా కంపెనీల తయారుచేసిన తాళాలు ఉండేవి. తాళాలు కలిగి ఉండడం అప్పట్లో ప్రతిష్టాత్మకమైన విషయం. ఆ విషయాన్ని గ్రహించిన గోద్రెజ్ కుటుంబం.. మంటల్లో ఇనుముని కరిగించి తాళం కప్ప మరియు తాళం చెవిని తయారు చేయడం మొదలుపెట్టారు ఈ విషయం తెలిసి ఆంగ్లేయులు చాలా కోప్పడ్డారు. భారతీయుల కోసం తాళం తయారు చేయడానికి తట్టుకోలేకపోయారు. తాళాల తయారీ ఆపివేయమని వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే గోద్రెజ్ కుటుంబం వెనక్కి తగ్గలేదు.
…
ఇంతవరకు బాగానే ఉంది. అసలు తాళం చెవులు అనే విషయాన్ని ప్రజలలోకి
తీసుకెళ్లడం ఎలా ..?? దీనికోసం అప్పటి పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్లు వేయించడానికి ప్రయత్నించారు. కానీ ఆంగ్లేయులు ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. తాళం చెవులకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లు పేపర్లో అచ్చు వేయించడానికి వీల్లేదని నిషేధం పెట్టారు. దీంతో గోద్రెజ్ కుటుంబ సభ్యులు కాగితాల మీద చేతిరాతతో నినాదాలు రాసి,, పోస్టర్లు తయారుచేసి .. వాటిని ముంబై నగరంలోని టీ స్టాల్స్ లోపల, హోటల్స్ లోపల రహస్యంగా అతికించేవారు. తర్వాత ఒకరిద్దరు యువకులు చెన్నై కోల్కతా చేరుకుని అక్కడ కూడా రహస్యంగా అతికించడం మొదలుపెట్టారు. ఈ విధంగా తాళం కప్పలు, తాళం చెవులు భారతీయుల చేతుల్లోకి వచ్చాయి..
ఆంగ్లేయుల దుశ్చర్య గోద్రెజ్ కుటుంబ సభ్యులకి కోపం తెప్పించింది. ఈ లోగా 1905 సమయంలో బెంగాల్ విభజన జరిగింది. ఆ తర్వాత స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. బ్రిటిష్ వారి విదేశీ వస్తువుల్ని నిషేధించాలని,, స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించాలని దేశమంతా ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వదేశీ వస్తువులతో పరిశ్రమలు పెట్టడం చాలా సాహసంతో కూడిన విషయం. ఆ సమయంలో గోద్రెజ్ కుటుంబం ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది. ప్రజలకు నిత్యావసర వస్తువులైన సబ్బులు, షాంపులు తయారీ ని చేపట్టింది. అప్పటివరకు సున్నిపిండి, కుంకుడు కాయలకు పరిమితమైన ఇళ్లలో … స్వదేశీ సబ్బుల వాడకం మొదలైంది. అంతేకాకుండా జంతువుల నూనెలను వాడకుండా కేవలం మూలికలు ఆకులతో ఆయుర్వేద సబ్బుని మొదటిసారిగా రూపొందించారు. అదే తర్వాత కాలంలో సింతాల్ అనే పేరుతో ఒక బ్రాండ్ గా మారిపోయింది.
…
ఇక, తర్వాత గోద్రెజ్ సంస్థలు వెనక్కి తిరిగి చూడలేదు. భారతదేశంలో ఇంటిళ్లపాదికీ అవసరమైన వస్తువుల తయారీని చేపట్టారు. మొదటి తరం పారిశ్రామికవేత్తల కుటుంబంగా రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో బ్రిటిష్ వాళ్ళ నుంచి చాలా ఒత్తిడులు
ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మొండిగా నిలబడి పరిశ్రమల్ని నడిపించారు.
..
స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో సాహిత్యము, సమాచారం ప్రజలకు అందించడం చాలా అవసరం అయింది. ప్రింటింగ్ మిషన్లు వచ్చినప్పటికీ అవి నగరాల్లోనే ఉండడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉండేది. ఈ సమయంలో గోద్రెజ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో టైపు రైటింగ్ మెషిన్ ని తయారుచేసి మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఈ టైపు రైటర్ల సహాయంతో చిన్న చిన్న పట్టణాల్లో సైతం ప్రింటింగ్ అనేది తేలిక అయిపోయింది. ఈ ప్రపంచం స్వాతంత్రం వచ్చాక కూడా దాదాపు 30, 40 సంవత్సరాలు పాటు కొనసాగింది. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా టైప్ రైటింగ్ మిషన్లు ఉపాధి కల్పించాయి.
…
ఈలోగా దేశానికి స్వతంత్రం వచ్చింది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలు జరుపుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించారు. అంతవరకు బాగానే ఉంది కానీ ఓట్లు వేయడానికి అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు అప్పట్లో లేవు. అప్పటి ప్రభుత్వ అవసరాలను గమనించి గోద్రెజ్ సంస్థ ముందుకు వచ్చింది. పగలు రాత్రి తేడా లేకుండా నెలలు తరబడి కష్టించి .. దేశమంతటికి అవసరమైన బ్యాలెట్ బాక్స్ లను రూపొందించారు. ఇవన్నీ పక్క పక్కన పెడితే దాదాపు 400 కిలోమీటర్ల దూరం వస్తుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఆనాటి నుంచి ఈనాటి దాకా బ్యాలెట్ బాక్స్ లు అంటే గోద్రెజ్ సంస్థ వే అన్న తరహాలో పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో గోద్రెజ్ బీరువాలు మార్కెట్లోకి వచ్చాయి. గోద్రెజ్ బీరువాలో దాచుకుంటే భద్రతకు ఢోకాలేదు అన్న నమ్మకం ప్రజల్లో కలిగింది.
..
ఈ సమయంలో జరిగిన ఒక సంఘటన గోద్రెజ్ మీద నమ్మకాన్ని మరింత పెంచింది. ముంబై పోర్ట్ లో ఎస్ ఎస్ పోర్టు సికల్ అనే రవాణా నౌక ఒక్కసారిగా పేలిపోయింది. ఆయిల్ ట్యాంక్ కు నిప్పు అంటుకోవడంతో మంటలు సముద్రం మీద కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించాయి. రోజుల తరబడి మంటలు మండాక.. ఆ తర్వాత మంటలను ఆర్పేశారు. ఆ తర్వాత ఓడలోకి వెళ్లి చూస్తే.. గోద్రెజ్ బీరువాలు అందులోని సామాగ్రి ముఖ్యమైన కాగితాలు చాలా సేఫ్ గా కనిపించాయి. దీన్నిబట్టి గోద్రెజ్ ఉత్పత్తుల నాణ్యత అందరికీ అర్థం అవుతుంది.
..
స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎదుర్కొన్న ఇంకో సమస్య.. అంటువ్యాధులు. దేశ జనాభా ని మింగేస్తున్న ఈ వ్యాధుల నుంచి రక్షించుకోవాలంటే టీకాలు ఒక్కటే మార్గం. కానీ ఈ టీకాలను చల్లటి వాతావరణంలో ఉంచితేనే పనిచేస్తాయి. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన గోద్రెజ్ సంస్థ.. టీకా బాక్సులను తయారు చేసింది. దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందు వరుసలో నిలిచింది.
..
ఇదంతా ఒక ఎత్తైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పర్యావరణం మీద గోద్రెజ్ సంస్థలు పనిచేస్తున్నాయి. నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్నో కార్యక్రమాలను తీసుకొచ్చారు. గోద్రెజ్ సంస్థల్ని పర్యావరణహితంగా మార్చేశారు. కాలనీలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సేవలకు గాను గోద్రెజ్ చైర్మన్ సోహ్రాబ్ కు ఇందిరాగాంధీ పర్యావరణ మిత్ర అవార్డు అందించారు.
..
ఇలా చెప్పుకుంటూ పోతే సమాజం కోసం గోద్రెజ్.. ఏ స్థాయిలో పనిచేస్తుందో తెలుస్తుంది. అంతమాత్రం చేత గోద్రెజ్ ఏమి స్వచ్ఛంద సంస్థ కాదు. కచ్చితంగా లాభాలు తీసుకుంటూ నిబద్ధతతో వ్యాపారాలు నిర్వహించింది. అందుచేతనే క్రమం తప్పకుండా 40 వేల కుటుంబాలకు ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా వ్యాపార సంస్థలు అందులో పనివాళ్ల రూపంలో మరో లక్ష మందికి ఉపాధిని అందిస్తోంది.
…
ఇంతటి భారీవ్యవస్థను అభివృద్ధి చేసిన గోద్రెజ్ సంస్థ చైర్మన్ సోహ్రాబ్ గోద్రెజ్ ను భారత ప్రభుత్వం పద్మభూషణ్ తో గౌరవించింది. సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్ల పుట్టినరోజు గుర్తుపెట్టుకుని సంబరాలు చేసుకునే ఈ తరం యువత.. ఇటువంటి మహనీయుల సేవలను కూడా గుర్తు చేసుకోవాలి.