ఎన్నికల సమయంలో పోటీకి దిగిన అభ్యర్థుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది. చాలా చోట్ల వ్యక్తిగత దూషణలు, ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వైసిపి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు చావో రేవో తేల్చుకునేందుకు తలపడుతున్నాయి . ఈ పరిస్థితుల మధ్య పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.
నరసాపురం నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేస్తున్న భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పాలకొల్లు సమీపంలోని ఉల్లంపర్రు గ్రామంలో ప్రచారంలో ఉండగా… అనుకోకుండా ప్రత్యర్థి అభ్యర్థి అయిన వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల అదే దారిలో ఎదురుగా వచ్చేసారు. దీంతో రెండు వర్గాల మధ్య ఉత్కంఠ నెలకొంది . పరిస్థితులు ఉద్రిక్తత కు దారితీస్తాయని గ్రామ పెద్దలు ఆందోళన చెందారు. ఈ సమయంలో బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చొరవ తీసుకుని ముందుకు అడుగు వేశారు. ఉమాబాలను నవ్వుతూ పలకరిస్తూ ” ఏమ్మా బాగున్నారా? ప్రచారం ఎలా సాగుతోంది..? కుటుంబ సభ్యులంతా బాగున్నారా..?”” అంటూ హుందాగా పలకరించారు. దీంతో తేరుకున్న ఉమాబాల కూడా దగ్గరకు వచ్చి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తో కరచాలనం చేసి నవ్వుతూ కాసేపు మాట్లాడారు. అనంతరం రెండు వర్గాలు తలో దారిన వెళ్లిపోయాయి. దీంతో ఉల్లంపర్రు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఘర్షణ చోటు చేసుకోవాల్సిన సమయంలో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ హుందాగా వ్యవహరించడంతో పరిస్థితి ప్రశాంతంగా మారిపోయింది. ఇంతటి పరిపక్వత బిజెపిలోనే సాధ్యమని పరిశీలకులు అంటున్నారు.