ఆడితప్పే కళలో ఆరితేరిన దొర!
ఆడి తప్ప రాదు. పలికి బొంకరాదు అని సామెత. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీనికి విరద్ధంగా నడుచుకోవాలని కంకణం కట్టుకున్నట్టున్నారు. ఫలానా పని చేయకుండా తల నరుక్కుంటా అని చెప్పి, మాట తప్పడం ఇప్పటికి ఎన్ని సార్లు జరిగిందో. తాను ఎన్నిసార్లు ఆడి తప్పిండో, పలికి బొంకిండో సీఎం మహాశయుడికి యాదికి ఉందో లేదు. కెసిఆర్ ఆడిన అతి పెద్ద అబద్ధం లేదా తప్పిన అతి పెద్ద మాట- దళిత సీఎం. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే మొదటి సీఎం. లేకపోతే తల నరుక్కుంటా అనే కెసిఆర్ భీషణ శపథానికి సంబంధించిన వీడియో ఇప్పటికీ ఇంటర్ నెట్లో అందుబాటులో ఉంది. కానీ కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన దళితుడు కాదు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మాటలు చెప్పి, చేతల్లో చేతులెత్తేశారు. వందకు వంద శాతం చేస్తానని సున్నకు సున్నా శాతం చేయడం ఆయనకు చాలా బాగా అలవాటు.
దుబ్బాకలో పోలింగుకు ముందు, ఆ ఊరికి కొద్ది దూరంలోనే రైతువేదిక సభను పెట్టి ఓ భావోగ్వేగ భరితమైన ప్రసంగం చేశారు కెసిఆర్. సన్న బియ్యం రైతుల గోల పోసుకున్నదే ఈ దొర. ఈయన మాటవిని సన్న పండించి ఆగమైపోయారు రైతులు. ఆ ఉసురు కెసిఆర్ కే తగులుతుందని విపక్ష నేతలు విమర్శించారు. దుబ్బాక్ పోలింగ్ కు ముందు వందకు వంద శాతం సన్న వడ్ల రైతులకు నూరో నూట యాభయో అదనంగా ఇస్తామన్నారు. ఆ తర్వాత పత్తా లేదు. దుబ్బాకలో కారు దెబ్బతింది. కమలం వికసించింది. కెసిర్ హామీ ఫాం హౌస్ కే పోయిందో. లేక ఏమైందో తెలియదు.
వరంగల్ వరదల సమయంలో ఆర్థిక సహాయం జాడలేదు. పంటలను వరదలు దెబ్బతీస్తే పరిహారం ఊసేలేదు. కనీసం మోడీ ఇచ్చే ఫసల్ బీమా కూడా రైతులకు అందకుండా అమానుషంగా అడ్డుకున్నది కెసిఆర్ సర్కార్. హైదరాబాదులో ఎన్నికలకు ముందు వరద సాయం పదివేలు ఇస్తామన్నారు. ఇచ్చిన కొందరిలో ఎక్కువ మంది తెరాస వారే అనే విమర్శలు వచ్చాయి. అందరికీ అందలేదనే ఆక్రోశం వినిపించింది. ఏరికోరి ముందస్తు ఎన్నికలు తెచ్చుకుని ప్రజల ఆగ్రహానికి గురయ్యారు కెసిఆర్. ఎన్నికల కౌంటింగ్ ముగిసి మర్నాటి నుంచే మళ్లీ వరద సాయం వందకు వంద శాతం ఇస్తామని ఎల్ బి స్టేడియం సభలో గంభీరంగా ప్రకటించారు దొర. ఆ తర్వాత అదీ అడ్రస్ లేదు. వందకు వంద శాతం ఆడ తప్పడం, పలికి బొంకడం అనే కళలో అందరికంటే ఆరితేరిన సీఎం అనే ముద్ర వేసుకున్నారు. ఉత్తమ సీఎం ల సర్వే జాబితాలో అట్టడుగున కెసిఆర్ పేరుందని వెల్లడైంది. అయినా ఇండియాలోనే తెలంగాణ నంబర్ వన్ అని కెసిఆర్, ఆయన తనయుడు వీనప్పుడల్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా ఘనకార్యం సాధిస్తే మనం చెప్పుకోవడం కాదు, మంచి చెప్పాలె అనే విషయం కూడా ఈ తండ్రీకొడుకులకు తెలియదేమో. ఇప్పుడు తనయుడిని సీఎంను చేస్తారనే గుసగుసలు బహిరంగ చర్చకు దారి తీశాయి. అదీ చూద్దాం.