రైతులను ఉద్దరించడానికే తమ ప్రభుత్వాలు ఉన్నాయని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు బాకాలు ఊదుతాయి.. రైతు భరోసా, రైతు బంధు పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాయి.. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఇక్కడే ఉన్నాయని గప్పాలు కొడుతున్నాయి.. మరి అప్పుల ఊబిలో ఉన్న రైతు కుటుంబాల జాబితాలో ఏపీ (93.3%), తెలంగాణ (91.7%) మొదటి రెండు స్థానాల్లో ఉండటం సిగ్గు చేటనిపించడం లేదా?
ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయాల దుస్థితిని చూడండి.. 2019లో జాతీయ స్థాయిలో 10వ స్థానంలో ఉన్న ఆచార్య జయశంకర్ వర్సిటీ 2020లో 30వ స్థానానికి దిగజారింది.. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ 11వ స్థానం దక్కించుకుంది. కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ 62వ ర్యాంకు.. పీవీ నరసింహారావు పశువైద్య వర్సిటీ 64వ ర్యాంకు స్థానంలో ఉన్నాయి.. వైఎస్ఆర్ ఉద్యాన వర్సిటీ 49వ ర్యాంకు, శ్రీ వెంకటేశ్వర పశువైద్య వర్సిటీ 57వ ర్యాంకు పొందాయి.. మన ప్రభుత్వాలు వ్యవసాయ విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో, రైతుల్లో ఎంత చైతన్యాన్ని తెస్తున్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్రాల ప్రకటనల గందరగోళం ఎలా ఉన్నా.. ఎవరు తప్పు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తే ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడేది కాదు.. తప్పులు సరిదిద్దు కోకుండా ఢిల్లీలో ధర్నాలు, పార్లమెంటును అడ్డుకోవడాలు చేస్తే పోయేది రాష్ట్రం పరువే..
~ Kranthidev Mitra


