అది చిన్న రాష్ట్రం . అప్పులున్న రాష్ట్రం కూడా. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు పోటీచేస్తున్న వాళ్లల్లో చాలామంది కుబేరులు. అదే హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ముఖ్యంగా ప్రధాన పార్టీలనుంచి పోటీలో ఉన్నా వాళ్లల్లో మెజారిటీ శాతం కుబేరులే ఉండడం విశేషం.
దాదాపు 90 శాతం కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ తాజా నివేదిక. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులంట. ఇక మొత్తంగా అయితే కాంగ్రెస్ నుంచి పోటీచేస్తున్న వాళ్లల్లో 61మంది, బీజేపీ వాళ్లల్లో 56మంది కుబేరులే.
బీజేపీ నుంచి సిమ్లాలోని ఛోపల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బల్వీర్ సింగ్ వర్మ రూ.128 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా..సిమ్లా రూరల్ సీటు నుంచి పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ రూ.101 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. నగ్రోటా సీటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ దివంగత నేత జి.ఎస్.బాలి తనయుడు ఆర్ఎస్.బాలి రూ.96.33 కోట్లతో మూడో ప్లేసులో ఉన్నారు. 68 అసెంబ్లీ స్థానాలకు గాను 412 అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వారిలో 226 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. ఆమ్ అద్మీ పార్టీ 67 మందిని బరిలో దింపగా, వారిలో కోటీశ్వరులు 35 మంది ఉన్నారు. బీఎస్పీ 53 స్థానాల్లో పోటీ చేస్తుండగా 13 మంది కోటీశ్వరులున్నారు. సీపీఎం నుంచి నలుగురు కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సైతం 45 మంది కుబేరులజాబితాలో ఉన్నారు.