దేశంలో 1951 నుంచి ఓటర్ల సంఖ్య 6 రెట్లు పెరిగింది. 2023 జనవరి 1 నాటికి దేశంలో మొత్తం 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1951లో దేశంలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు 17.32 కోట్ల ఓటర్లు ఉండగా, వారిలో 45.67 శాతం మంది మాత్రమే ఓటు వేశారు. తర్వాత ఓటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని 75 శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం ప్రయత్నించినప్పటికీ, మూడింట ఒక వంతు అంటే 30 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు. దాంతో 91.20 కోట్ల మంది ఓటర్లకు 67.40 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఓటు వినియోగించుకోని వారిలో అధికంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత, వలసదారులు ఉన్నారు.ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు ఉన్నందున ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఈసీ దృష్టి పెట్టింది.