సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై ఆమె స్పందించారు.
దేశాన్ని నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలు వేధిస్తుంటే… బీజేపీ దృష్టి మసీదులపై పడిందని అన్నారు.
ఔరంగజేబు హయాంలో ధ్వంసమైన దేవాలయాలపై ఇప్పుడు చర్చ జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు భారతదేశంలో 50 శాతం పర్యాటకం మొఘలుల వల్లే జరిగిందని ఆమె అన్నారు. భారతదేశంలో పర్యాటక రంగాన్ని నాశనం చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపిస్తూ….
‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను ప్రస్తావించారు.
ఇటీవల కశ్మీర్లో పండిట్లను టార్గెట్ చేయడంపై స్పందిస్తూ.. సినిమా విడుదలైన తర్వాత హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు పెరిగిపోయాయని అన్నారు.
“వాస్తవ విషయాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వారు హిందూ-ముస్లిం సమస్యలను సృష్టిస్తున్నారు.. ఇప్పుడు వారు జ్ఞానవాపి మసీదుమీద పడ్డారు” అని ముఫ్తి అన్నారు.
జ్ఞాన్వాపి మసీదు కేసులో కోర్టు నియమించిన కమిటీ కాంప్లెక్స్లో శివలింగాన్ని గుర్తించిందని హిందూ పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య పేర్కొన్న తర్వాత ముఫ్తీ ఈ వ్యాఖ్యలు చేశారు. శివలింగం తేలిన ఆ క్షణంలో మసీదు ప్రాంగణంలో ‘హర హర మహాదేవ’ నినాదాలు ప్రతిధ్వనించాయి” అని ఆర్య పేర్కొన్నారు. శృంగర్ గౌరీ ఆలయంలో రోజువారీ పూజలకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు సర్వేకు ఆదేశించింది.