అక్రమంగా 50 లక్షలు తీసుకొని 250 మంది చైనా పౌరులకు వీసా మంజూరు చేసినట్టు వచ్చిన ఆరోపణలపై మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, లోక్సభ ఎంపి కార్తీ చిదంబరంపై సిబిఐ కేసు నమోదు చేసింది.
చెన్నైలోని కార్తీ చిదంబరం నివాసం సహా దేశంలోని పలు నగరాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.చెన్నైలోని మూడు ప్రాంతాల్లో, ముంబయిలోని మూడు ప్రాంతాల్లో, కర్ణాటక, పంజాబ్, ఒడిశాలోని ఒక్కొక్క చోట్లా సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ తనికీలపై కార్తీ ట్విట్టర్ వేదిగ్గా స్పందిస్తూ ఘాటు విమర్శలు చేశారు, ” కౌంట్ మర్చిపోయా.. ఎన్ని సార్లు ఇలాంటి సోదాలు జరిగి ఉంటాయి? బహుశా ఓ రికార్డు అయి ఉంటుంది” అని ట్వీట్ చేశారు.
యూపీఏ హయాంలో 250 మంది చైనా పౌరులకు వీసా కల్పించేందుకు కార్తీ చిదంబరం 50 లక్షలు లంచం తీసుకున్నారని సీబీఐ ఆరోపించినట్లు అధికారులు తెలిపారు. ఐఎన్ఎక్స్ మీడియా కోసం ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపిబి) క్లియరెన్స్ పొందడంపై ఆయన ఇప్పటికే విచారణలో ఉన్నారని వారు తెలిపారు.