మారుమూల ప్రాంతాల నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రిమోట్ ఏరియాలో సైతం 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చేలా జియో టవర్లను ప్రారంభించారు సీఎం జగన్ . గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు,స్థానికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో సెల్ టవర్లు లేక నెట్వర్క్ అందుబాటులో లేదు.ఈ సమస్య ను పరిష్కరిస్తూ కొత్తగా 2వేల 704 చోట్ల సెల్ టవర్లు ఏర్పాటుకు నిర్ణయించారు. అందుకు రిలయన్స్ జియో సంస్థతో ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం. 4జీ సేవలు అందించేందుకు ముందుగా 100 జియో టవర్లను వర్చువల్ విధానంలో క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు సీఎం.ఈ వంద టవర్ల ద్వారా 209 మారుమూల గ్రామాలకు సెల్ ఫోన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైయస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు.భవిష్యత్తులో ఇక్కడ 5జీ సేవలను అప్గ్రేడ్ చేయనుంది జియో సంస్థ..