56 మంది ప్రాణాలను బలిగొన్న 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుపై గుజరాత్లోని ప్రత్యేక కోర్టు తన తీర్పును వెలువరించింది. 77 మంది నిందితుల్లో 28 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించగా, 49 మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి శిక్ష ఖరారు చేయనున్నారు.
దోషులుగా తేలిన వారిలో సఫ్దర్ నగోరి, జావేద్ అహ్మద్ సహా అతికుర్ రెహ్మాన్ ఉన్నారు. ఉగ్రవాదానికి సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 16, అలాగే IPC సెక్షన్లు 302 (హత్య), 120-B (నేరపూరిత కుట్ర) కింద మొత్తం 49 మంది దోషులుగా నిర్ధారించబడ్డారు.
విచారణలో 547 చార్జిషీట్లు దాఖలు చేశామని, 1,163 మంది సాక్షులను విచారించామని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ తెలిపారు. “కోర్టు 28 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషులుగా విడుదలైన వారిలో మహ్మద్ ఇర్ఫాన్, నసీర్ అహ్మద్, షకీల్ అహ్మద్ ఉన్నారు. నిందితులందరూ వివిధ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
గత సెప్టెంబర్లో కోర్టు విచారణను ముగించింది. కోర్టు తీర్పును ఫిబ్రవరి 1వ తేదీగా నిర్ణయించింది, అయితే న్యాయమూర్తి అస్వస్థతకు గురికావడంతో కేసును ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. ఇండియన్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న వ్యక్తులే ఈ పేలుళ్లకు పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు.
పేలుళ్లు జరిగిన కొన్ని రోజుల తర్వాత, పోలీసులు సూరత్లోని వివిధ ప్రాంతాల నుండి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్లో 20, సూరత్లో 15 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ కేసులో 78 మందిపై 2009 డిసెంబర్ లో విచారణ ప్రారంభమైంది. ఒకరు అప్రూవర్ అయిన తర్వాత దోషుల సంఖ్య 77కి తగ్గింది. మరో నలుగురిని అరెస్టు చేశామని, అయితే వారి విచారణ ఇంకా ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది తెలిపారు.