ఉత్తరాఖండ్లోని రిషికేష్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చికిత్స కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయం కోసం విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నారు. 1993లో స్థాపించిన భౌరావ్ దేవరస్ సేవా న్యాస్ అనే NGO ఈ 400 పడకల విశ్రామ్ సదన్ (విశ్రాంతి గృహం) నిర్మాణానికి చొరవ తీసుకుంది. ఇక్కడ రిషికేశ్ ఎయిమ్స్లోని రోగులు, వారి బంధువులకు చాలా నామమాత్రపు ఖర్చుతో వసతి, ఆహారం అందిచనున్నారు.
మాధవ్ సేవా విశ్రామ్ సదన్ పేరుతో డెహ్రాడూన్ జిల్లాలోని వీరభద్ర పట్టణంలో ఎయిమ్స్ రిషికేశ్కు సమీపంలోని ట్రస్ట్కు లీజుకు ఇచ్చిన 3.5 ఎకరాల స్థలంలో ఈ విశ్రాంతి గృహాన్ని నిర్మించనున్నట్లు భౌరావ్ దేవరస్ సేవా న్యాస్ ట్రస్టీ సంజయ్ గార్గ్ తెలిపారు. 55 కోట్ల వ్యయంతో డిసెంబర్ 2023 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ సదుపాయం నిర్మాణం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ట్రస్టుకు రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. AIIMS రిషికేశ్లో చికిత్స పొందిన రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ సరసమైన వసతి, ఆహారం దొరుకుతుంది అని ఆయన తెలిపారు.
135 గదులను కలిగి ఉండే ఈ భవనం 400 పడకల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ భవనాన్ని సంప్రదాయ భారతీయ వాస్తుశిల్ప కళను దృష్టిలో ఉంచుకుని నిర్మించనున్నారు. విశ్రాంతి సదన్లో రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత కంటి పరీక్షలు చేసే సదుపాయం ఉంటుంది. ఈ కేంద్రంలో రెస్టారెంట్, లైబ్రరీ, ఆడిటోరియం, ధ్యాన గదులతో పాటు ఫిజియోథెరపీ, నేచురోపతి, యోగా సహా పంచకర్మ సౌకర్యాలు కూడా ఉంటాయి.
AIIMSలో చికిత్స కోసం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే రోగులు, సహాయకులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు రోగులు, వారి కుటుంబసభ్యులు బస, ఆహారం కోసం ఖరీదైన హోటళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
ఇటీవల జూన్ 13న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రిషికేశ్లో మాధవ్ సేవా విశ్రమ్ సదన్కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. యోగా గురు బాబా రామ్దేవ్, జునా అఖారా చీఫ్ స్వామి అవధేశానంద గిరి, హిందూ ధర్మకర్త విజయ్ కౌశల్ మహరాజ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రముఖ సభ్యుడు సురేష్ భయ్యాజీ జోషి, సంఘ్ ప్రధాన కార్యకర్త గోపాల్ కృష్ణ శర్మ, మాజీ సీఎం, హరిద్వార్ ఎంపీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, మాజీ ఈ కార్యక్రమంలో సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, రాజ్యసభ ఎంపీ నరేష్ బన్సాల్, కేబినెట్ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
యోగా కేంద్రంగా, రిషికేశ్ ఆరోగ్య సేవలకు కూడా కేంద్రంగా ఉందని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారని ధామి అన్నారు. రోగులు, వారి బంధువుల కోసం విశ్రామ్ సదన్ను ప్రారంభించాలనే ఆలోచనను ఒక దైవిక సేవగా సీఎం అభివర్ణించారు. భౌరావ్ దేవరస్ సేవా న్యాస్కు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాధవ్ సేవా విశ్రామ్ సదన్ నిర్మాణానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ.50 లక్షలు అందజేస్తుందని ధామి తెలిపారు.
దేశంలోని వివిధ ప్రాంతాలలో AIIMS సమీపంలో ఇలాంటి ఐదు విశ్రాంతి గృహాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి, పేషెంట్లకు, వారి కుటుంబసభ్యులకు నామమాత్రపు ధరలకు వసతి, ఆహారం సహా అనేక ఇతర సౌకర్యాలను అందిస్తోంది.