సిక్కుల ఊచకోత జరిగి 38 ఏళ్లు. స్వతంత్ర్య భారతంతోనే దారుణమారణకాండగా నాటి ఘోరాన్ని చెప్పవచ్చు. 1984 అక్టోబర్ 31లో నాటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఇద్దరు అంగరక్షుకులు హత్య చేసిన తరువాత అల్లర్లు చెలరేగాయి.
ఇందిర హత్య మరునాడే అంటే నవంబర్ 1నుంచి నాలుగు రోజుల పాటు హత్యాకాండ కొనసాగింది. సాయుధులైన దుండగులు దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులపై విరుచుపడ్డారు. ఆ హత్యాకాండలో 4 వేల మంది చనిపోయారని పలు సంస్థలు లెక్కలేసినా ఆ సంఖ్య రెట్టింపు ఉంటుందని అంటారు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది చనిపోయారు. సిక్కులు కంటపడితే చాలు అల్లరిమూకలు రెచ్చిపోయి దాడులు చేశారు. పొట్టనపెట్టుకున్నారు. రోడ్డుమీదకు వచ్చిన సిక్కులనే కాదు…గురుద్వారాలు, సిక్కుల దుకాణాలు, ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇళ్లల్లోకి చొరబడి అందినకాడికి దోచుకున్నారు. మహిళలపై అత్యాచారాలకూ తెగబడ్డారు కొందరు దుండగులు. ముూడురోజులైతే ఢిల్లీ వీధుల్లో అత్యంత పాశవికంగా హత్యాకాండ సాగింది. మెడలో టైర్లు తగులబెట్టారు. వాళ్లు అరుస్తూ ప్రాణభయంతో పరుగెత్తుతుంటే చుట్టూ చేరి హాహాకారాలు చేస్తూ నిలబడి పూర్తిగా సజీవదహనం అయ్యేదాకా ఉండిపోయారు. సిక్కులు వెళ్తున్న వాహనాలు కంటబడితే చాలు పెట్రోల్ పోసి అంటించిన ఘటనలు ఎన్నో. పోలీసులూ ప్రేక్షకపాత్ర వహించాలని చెప్పవచ్చు. నాటి ఘటనతో బెంబేలెత్తిపోయి దాదాపు 20వేలమంది సిక్కులు ఢిల్లీ వదిలి వెళ్లిపోయారు. సర్వం కోల్పోయిన వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అయితే తమ ప్రియతమ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను జీర్ణించుకోలేని ఆమె అభిమానులు ఈ దాడులకు పాల్పడ్డారని సమర్థించారు కొందరు పాలకపార్టీ పెద్దలు.
ఢిల్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలోని సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీమతి రామాదులరి సిన్హా పార్లమెంట్ లో జనవరి, 1985లో ఇచ్చిన సమాధానం ప్రకారం 16 రాష్ట్రాలలో హింసాయుత సంఘటనలు జరిగాయి. వాటిల్లో 12 రాష్ట్రాలలో హత్యలు జరిగాయి.
ప్రముఖ జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ “మై బ్లీడింగ్ పంజాబ్” పేరుతో 1992లో ప్రచురించిన గ్రంధం ప్రకారం ఇందిరా గాంధీ హత్య జరిగిన రాత్రి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకులు “సిక్కులకు ఎప్పటికీ మరచిపోలేని గుణపాఠం ఎలా చెప్పాలో” నిర్ణయించడానికి సమావేశమయ్యారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. గుడిసెల పట్టణాలు, పొరుగు గ్రామాలలో నివసించే అసాంఘిక శక్తులను సమీకరించారు”.
“సిక్కుల గృహాలు, దుకాణాలను గుర్తించారు. కమాండర్ ట్రక్కులలో ఇనుప రాడ్లు, కిరోసిన్ నూనె డబ్బాలు, పెట్రోల్ లను సమకూర్చుకొని నవంబర్ 1వ తేదీ తెల్లవారుజామున, సిక్కు వ్యతిరేక హింసాకాండను ప్రారంభించారు. ఉక్కు కడ్డీలు, జెర్రీ క్యాన్ల నిండా కిరోసిన్ ఆయిల్, పెట్రోలింగ్తో ఆయుధాలతో కూడిన ట్రక్కుల లోడ్లు నగరం చుట్టూ తిరిగారు. గురుద్వారాలకు నిప్పు పెట్టారు” అని అందులో ఆయన వివరించారు.
ఢిల్లీలో, అల్లర్లను అణిచివేసేందుకు పోలీసులు, పారా-మిలటరీ బలగాలు అసమర్ధులు కాకపోయినా అందుకు సుముఖంగా లేరని కుష్వంత్ సింగ్ స్పష్టం చేశారు.అసలేమీ జరుగుతుందో గ్రహించడానికి అధికారులకు 24 గంటల సమయం పట్టింది. కర్ఫ్యూను ప్రకటించినా, విధించలేదు. చూడగానే కాల్పులు జరిపే అధికారం ఇచ్చినా, ఎక్కడా ఎవ్వరు అమలు పరచలేదు.
వీధులలో పెట్రోలింగ్ పార్టీలు ఎక్కడ కనిపించక పోయినా ప్రభుత్వ ఆధీనంలోని ఆకాశవాణి, దూరదర్శన్లలో ఎక్కువగా వినిపించిందని అంటూ ఆయన ఆ నాటి భయానిక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. గడువుకన్నా ముందే రాజీవ్ గాంధీ ఎన్నికలకు వెళ్లారు. అన్ని ప్రచార సాధనాల ద్వారా భారీ ప్రచారం ప్రారంభించారు. అన్ని భాషల పత్రికలలో పూర్తి పేజీ ప్రకటనలు ఇచ్చారు. అవి ఈ విధంగా సాగాయి:
“దేశం సరిహద్దు చివర్లు ఇంటి గుమ్మాలకు తరలించబడుతుందా?” “వేరే రాష్ట్రానికి చెందిన టాక్సీ-డ్రైవర్ నడుపుతున్న టాక్సీలో ప్రయాణించడం మీకు ఎందుకు అసౌకర్యంగా అనిపిస్తుంది?” భారీ హోర్డింగ్లు యూనిఫాంలో ఉన్న ఇద్దరు సిక్కులు రక్తంతో తడిసిన శ్రీమతి గాంధీని భారతదేశం మ్యాప్ బ్యాక్డ్రాప్కు వ్యతిరేకంగా కాల్చడం లేదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్రంతో రాష్ట్రంలో పడి ఉన్న శ్రీమతి గాంధీ మృతదేహం ఆమెకు నివాళులర్పిస్తున్నట్లు ఈ ప్రకటనలు చూపించాయి.
2006లో ప్రచురించిన జస్కరన్ కౌర్ రచన “నవంబర్ 1984లో భారతదేశంలో సిక్కుల పోగ్రోమ్స్: ఎ రిపోర్ట్ బై ఎన్సాఫ్” లో
గుంపులు, టెలివిజన్లో, పరిసరాల్లోని హంతక పదాలు, నిరంతర పల్లవిలు సిక్కులను చంపాలనే ప్రబలమైన కోరికను ప్రదర్శించాయి. “ఖూన్ కా బద్లా ఖూన్,” (రక్తానికి రక్తం) నినాదం ఎయిమ్స్ వద్ద ప్రారంభమై ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్ ద్వారా భారతదేశం అంతటా ప్రతిధ్వనించింది.
పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజిత్ సింగ్ నరులా, నవంబర్ 1 ఉదయం స్థానిక టెలివిజన్ లో శ్రీమతి గాంధీ మృతదేహం ఉన్న తీన్ మూర్తి వెలుపల ఉన్న జనం “ఖూన్ కా బద్లా ఖూన్” , “ఖూన్ కా బద్లా ఖూన్” అని నినాదాలు చేయడం చూసి ఆశ్చర్యపోయారు. సర్దార్ ఖౌమ్ కే గద్దర్, లేదా “సర్దార్లు దేశ ద్రోహులు” అని పెద్ద సంఖ్యలో ఆవేశపూరితంగా నినాదాలు ఇస్తుంటే వారిని ఆపడానికి ప్రభుత్వ అధికారులు ఎవ్వరు ప్రయత్నించగా పోవడాన్ని చూసారు.
నూతనంగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్గాంధీ కూడా అటువంటి నినాదాలను ఆపే ప్రయత్నం చేయలేదు. తరచుగా వినిపించిన ఇతర నినాదాలు: “మార్ డియో సలోన్ కో,” (ఆ వెధవలను చంపండి), “సిఖోన్ కో మార్ దో ఔర్ లూట్ లో,”(సిక్కులను చంపి వారిని దోచుకోండి), “సర్దార్ కోయి భీ నహిన్ బచ్నే పై” (ఏ సర్దార్ని తప్పించుకోనివ్వవద్దు).
అల్లర్లపై దర్యాప్తు జరిపిన నానావతి కమీషన్ 2005లో ప్రభుత్వంకు సమర్పించిన చివరి నివేదికలో హింసాత్మక దాడులు జరిగిన తీరును పరిశీలిస్తే, బహుశా సిక్కులపై దాడులు కాంగ్రెస్ లేదా వారి మద్దతుదారులు లేదా కొన్ని ఇతర సంస్థలు లేదా సంఘాలచే నిర్వహించబడి ఉండవచ్చని స్పష్టం చేసింది. రాకబ్ గంజ్ సాహిబ్ గురుద్వారా వద్ద విధ్వసం సృష్టించిన గుంపులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కమల్ నాథ్, వసంత్ సాఠే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడం గమనార్హం.
ప్రధాని రాజీవ్ గాంధీ నవంబర్ 19, 1984న తన ప్రసంగంలో “ఇందిరాజీ హత్య తర్వాత దేశంలో కొన్ని అల్లర్లు జరిగాయి. ప్రజలు చాలా కోపంగా ఉన్నారని మాకు తెలుసు. కొన్ని రోజులు భారతదేశం అల్లాడిపోయినట్లు అనిపించింది. కానీ ఒక బలమైన వృక్షం కూలినప్పుడు, దాని చుట్టూ ఉన్న భూమి కొద్దిగా కంపించడం సహజం” అంటూ స్పష్టంగా ఈ అల్లర్లను సమర్ధించారు.
గురుచరణ్ సింగ్ బబ్బర్ సంపాదకీయంలో ఈ అల్లర్లపై ప్రచురించిన ఒక గ్రంధంలో ఒక సంఘటనను వివరించారు. మాజీ ప్రధాని, చరణ్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాజీవ్ గాంధీని కలుసుకుని, కాంగ్రెస్ ఎంపీలు తమ మద్దతుదారులను కస్టడీ నుండి విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు.
“నేషనల్ హెరాల్డ్ దినపత్రిక కాంగ్రెస్ పార్టీకి చెందినట్లే, ఎక్స్ప్రెస్ ప్రతిపక్ష వార్తాపత్రిక” కాబట్టి వారి నివేదికను సీరియస్గా తీసుకోవలసిన అవసరం లేదు” అంటూ ప్రధాని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.
అధికారిక టెలివిజన్ దూరదర్శన్ లో కేవలం తీన్ మూర్తి భవన్ వద్ద గల ఇందిరాగాంధీ మృత దేశం గురించే గాని సిక్కుల ఊచకోత గురించిన ఎటువంటి కవరేజీని చేయలేదు. శిఖులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న గుంపుల ఫుటేజీని పదే పదే చూపించడం గురించి భారత ప్రభుత్వం మిశ్రా విచారణ కమీషన్కు ఇచ్చిన సమాధానంలో ఇలా చెప్పింది:
“’ఖూన్ కా బద్లా ఖూన్’, ‘సిఖ్ కౌమ్ కే గద్దర్’ వంటి నినాదాలు చేసే వ్యక్తులను దూరదర్శన్ చిత్రీకరింపలేదు. దివంగత ప్రధానమంత్రికి నివాళులు అర్పించేందుకు వరుసలో ఉన్న భారీ జనసమూహం దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలో టీవీ కెమెరాల ఫోకస్ కొన్నిసార్లు వాటిని కూడా కవర్ చేసింది”.
హత్యాకాండ జరిగిన 34 ఏళ్ల తరువాత 2018లో ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమారే అల్లరిమూకను రెచ్చగొట్టారంటూ దోషిగా తేల్చింది. ఆయనకు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.
అసలైతే ఆకతాయిలను రెచ్చగొట్టి హింసకు పురిగొల్పిన వాళ్లలో పార్టీ నాయకులు హెచ్కెఎల్ భగత్, జగదీష్ టైట్లర్, లలిత్ మకాన్, ధరమ్ దాస్ శాస్త్రి కూడా ఉన్నారంటారు.
ఇంతకుముందు సెషన్స్ కోర్టు ఈ కేసులోని మరో నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ సజ్జన్ కుమార్ను మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. తరువాత డిల్లీ కోర్టు సజ్జన్ ను దోషిగా తేల్చింది. సజ్జన్ ఇంతకాలం రాజకీయ అండదండలతో విచారణనుంచి తప్పించుకుంటూ వచ్చారని ఈ సందర్భాగం కోర్టు వ్యాఖ్యానించింది.