జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇంటి దగ్గర భద్రతాలోపాలకు సంబంధించిన ఘటనలో ముగ్గురిపై వేటు పడింది. ముగ్గురు పారామిలిటరీ సిబ్బందిని కేంద్రం తొలగించింది. దేశంలో ప్రాణాలకు ముప్పు పొంచివుండే వ్యక్తుల్లో జాతీయ భద్రతా సలహాదారు ఒకరు. ఆ బాధ్యతలో ఉన్నవారికి సీఐఎస్ఎఫ్ ‘Z+’ భద్రతను కల్పిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని అజిత్ దోవల్ నివాసంలో భద్రతా ఉల్లంఘనపై విచారణ జరిపిన అనంతరం ముగ్గురు సిఐఎస్ఎఫ్ కమాండోలను, విఐపి భద్రతా విభాగానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సర్వీస్ నుంచి తొలగించామని అధికారులు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఒక అపరిచిత వ్యక్తి ఫిబ్రవరి 16న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఎస్యూవీ వాహనంతో అజిత్ ధోవల్ ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే భద్రతా సిబ్బంది కారుని అడ్డుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అజిత్ దోవల్ ఇంట్లోనే ఉన్నారు. విచారణలో ఎవరో తన శరీరంలో ఎవరూ చిప్ పెట్టారని, వాళ్ళే తనను కంట్రోల్ చేస్తున్నారని తెలిపాడు. తీరా అతనికి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే శరీరంలో ఎలాంటి చిప్ లేదని తేలింది. అతడ్ని అరెస్ట్ చేసి ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగానికి అప్పగించారు. సిబ్బంది వైఫల్యం కారణంగానే ఇదంతా జరగడంతో ధోవల్ భద్రత నుంచి ముగ్గురు కమాండోలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది.