పేరుమోసిన అండర్ వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రివార్డు ప్రకటించింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ముంబయిపేలుళ్ల నేపథ్యంలో అమెరికా ఎప్పుడో దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దావూద్ భారత్ లో డి గ్యాంగ్ పేరుతో అరాచకాలు సాగిస్తున్నాడు. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ విక్రయాలు, నకిలీ కరెన్సీ చలామణి, పౌరులు లక్ష్యంగా బాంబు పేలుళ్లు వంటివాటికి పాల్పడుతోందీ ఈ గ్యాంగ్. దావూద్ కు పాకిస్తాన్ సహకారం ఉందని దర్యాప్తులో తేలింది. దావూద్ లష్కరేతోయిబా, జైషే మహ్మద్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని కూడా తేలింది. ఇక దావూద్ తోపాటు అతని సన్నిహితుడు ఛోటా షకీల్ తలకు 20 లక్షలరూపాయలు, అతని సోదరుడు అనీస్ ఇబ్రహీంపై రూ.15 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. దావూద్ అనుచరులైన జావేద్ పటేల్, జావేద్ చిక్నా, ఇబ్రహీం ముస్తాఖ్, అబ్దుల్ రజాఖ్ మెమోన్ అలియాస్ టైగర్ మెమోన్ ల ఆచూకీ చెప్పిన వారికీ నగదు బహుమతులిస్తామని ప్రకటించింది ఎన్ఐఏ.