1988లో జరిగిన రోడ్ రేజ్ కేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఇవాళ ఏడాది జైలు శిక్ష విధించింది. రోడ్డుపై దాడి చేసి ఒకరి హత్యకు కారణమైన కేసులో సిద్ధూను దోషిగా తేల్చింది. సిద్ధూకు విధించిన శిక్షపై బాధితుడి కుటుంబం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, ఎస్కే కౌల్లతో కూడిన ధర్మాసనం అనుమతించింది.
ఈ కేసులో 65 ఏళ్ల వ్యక్తిని గాయపరిచిన నేరానికి సిద్ధూను మే 2018లో సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించినప్పటికీ, అది అతనికి జైలు శిక్షను తప్పించి.. 1,000 జరిమానా విధించింది.
రికార్డ్ లో లోపం స్పష్టంగా ఉన్నట్లు మేం భావిస్తున్నాం.. అందుకే మేం సమస్యపై సమీక్ష దరఖాస్తును అనుమతించాం. ఇదివరకు విధించిన జరిమానా తోపాటు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం సముచితమని మేం భావిస్తున్నాం” అని తీర్పును ప్రకటిస్తూ ధర్మాసనం పేర్కొంది.
“ఒకే పిడికిలి దెబ్బ 65 ఏళ్ల వ్యక్తి మరణానికి దారితీసిందని చూపించడానికి ఎటువంటి సాక్ష్యం లేదు” అని సిద్దు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. కేసును పునఃప్రారంభించేందుకు బాధితురాలి కుటుంబం దురుద్దేశపూరిత ప్రయత్నం చేస్తోందని కూడా ఆయన ఆరోపించారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం, 1988 డిసెంబరు 27న పాటియాలాలోని షెరన్వాలా గేట్ క్రాసింగ్ దగ్గర రోడ్డు మధ్యలో పార్క్ చేసిన జిప్సీలో సిద్ధు, సంధు ఉన్నారు. బాధితుడు మరో ఇద్దరు డబ్బు విత్డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారు. వారు క్రాసింగ్ వద్దకు చేరుకున్నప్పుడు మారుతీ కారును నడుపుతున్న గుర్నామ్ సింగ్.. మార్గమధ్యంలో జిప్సీని గుర్తించి, దానిని తొలగించమని అందులో ఉన్న సిద్ధూ, సంధులను కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. అది కాస్త ఘర్షణకు దారితీసింది.