గుజరాత్ లోని బొటాడ్లో విషాదం జరిగింది. కల్తీ మద్యం తాగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చేరారు. మృతులకు మద్యానికి బదులుగా రసాయనాలను విక్రయించారని గుజరాత్ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలుగా పోలీసులు తెలిపారు. నాటు సారా తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణ కొనసాగుతోందని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు.
ఈ ఘటనపై విచారణ జరిపి నకిలీ మద్యం విక్రయించే దొంగలను పట్టుకునేందుకు డీఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు.
సిట్ విచారణ ప్రకారం బాధితులకు విషపూరిత మద్యంలో ఉండే మిథైల్ను ఎమోస్ అనే కంపెనీ సరఫరా చేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. గోడౌన్ మేనేజర్ జయేష్ అలియాస్ రాజు తన బంధువు సంజయ్కు రూ.60 వేలకు 200 లీటర్ల మిథైల్ను సరఫరా చేశాడు. సంజయ్ అతని సహచరుడు పింటూ, మిథైల్ రసాయనాలతో నిండిన పౌచ్లను దేశంలో తయారు చేసిన మద్యం పేరుతో ప్రజలకు విక్రయించారు. మృతులు దానిని సేవించి అనారోగ్యంతో మరణించారు. మొత్తం 600 లీటర్ల మిథైల్ను ఎమోస్ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికను స్వీకరించిన తర్వాత పోలీసులు ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదు చేసే పనిలో ఉన్నారు. నిందితులపై హత్యానేరం మోపనున్నట్లు సమాచారం.
40 మందికి పైగా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది, వారు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువగా భావ్నగర్లోని సర్ తక్త్సిన్హ్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా బొటాడ్ జిల్లా బర్వాలా తాలూకాలోని రోజిద్ గ్రామం సహా చుట్టుపక్కల మరికొన్ని గ్రామాలకు చెందినవారు.
ఇప్పటివరకు అక్రమ మద్యం వ్యాపారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఆయా ప్రాంగణాలలో దొరికిన అన్ని రసాయన పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.