జనవరి 19వ తేదీ 1990.
ఈ రోజు కొన్ని వేల హిందూ, సిక్కు కుటుంబాలకు చీకటి రోజు. కొంప, గోడూ వదిలేసి తమ చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు వదిలేసి, ప్రాణాలు అరచేత పట్టుకుని కట్టు బట్టలతో తమ దేశంలోనే తమ స్వస్థలాల నుండి దారుణంగా గెంటివేయబడ్డ రోజు.
ఆరోజు అసలు ఏం జరిగింది?
“రాలివ్, స్త్యాలివ్, గాలివ్” అంటే
మారండి, భూమి వదలండి, లేదా చావండి.
ఇవి ఆ రోజు మసీదుల లోంచి భీకరంగా, భయంకరంగా వినబడిన హెచ్చరికలు.
చాలా మంది ఆరోజు జరిగిన సంఘటనల గురించి రాశారు. కల్నల్ తేజ్ కుమార్ టికూ రాసిన పుస్తకం “కాశ్మీర్:ఇట్స్ అబోరిగైన్స్ అండ్ దైర్ ఎక్సోడస్” (అంటే “మూలవాసులు వారి గెంటివేత” అని చెప్పుకోవచ్చు) లో ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనల గూర్చి వివరంగా రాశారు.
సాధారణ ముస్లింలు పెద్ద సంఖ్యలో తమ బంధనాలు తెంపుకుని రోడ్లు మీదకు వచ్చి కాఫిర్లను తరిమి కొట్టి కాశ్మీర్ కి స్వాతంత్య్రం తేవాల్సిన సమయం వచ్చింది అని, మైకుల్లో పదే పదే స్లొగన్స్ ఇస్తూ ముస్లింలను రెచ్చగొట్టారట. హిందువులను సిక్కులకు భయబ్రాంతులకు గురి చేస్తూ “మారండి లేదా వదలండి లేదా చావండి” అని మైక్ లో నినాదాలు. దాంతో “భారత్ కు చావు మూడింది, కాఫిర్లకు చావు మూడింది” అంటూ నినాదాలు ఇస్తూ వేల సంఖ్యలో ముస్లింలు రోడ్ల మీదకు వచ్చారు.
ఇంతకు ముందు వలసలు జరిగాయి కానీ ఈ ఏడో వలస భయంకరమైనది. హిందువులకు, సిక్కులకు పరిస్తితి అర్ధం అయింది. కాశ్మీర్ పండిట్స్ సంఘర్ష సమితి లెక్కల ప్రకారం ఆ ఒక్క రోజే 75, 343 కుటుంబాలు కాశ్మీర్ నుండి వలసపోయారు..
ఒక వైపు మైకుల్లో నుండి ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు ఇస్తూ పండిట్స్ పారిపోతూ వుంటే ముస్లింలను మాత్రమే కాల్చి చంపడానికి వీలుగా అప్పటి గవర్నర్ జగ్ మోహన్ కావాలని పండిట్స్ ని కాశ్మీర్ నుండి తరిమేస్తున్నాడు అని తిరిగి మిలిటెంట్స్ అరోపించసాగారు.
కానీ ఆ రోజు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని ముందుగా జమ్మూ అక్కడ నుండి ఢిల్లీ మొదలగు ప్రదేశాలకు పారిపోయారు. కాశ్మీర్ నుండి జమ్మూ తీసుకువెళ్ళడానికి వాహనాల వాళ్ళు విపరీతంగా దోచేశారు.
ఎక్కువగా మధ్యతరగతి కమ్యూనిటీ వారు తాము విడిచిపెట్టిన తమ ఇళ్లకు దూరంగా దుర్భరమైన, అపరిశుభ్రమైన శిబిరాల్లో టెంట్స్ లో జీవించేవారు. ఢిల్లీ, పూణే, ముంబై, అహ్మదాబాద్, జైపూర్ సహా లక్నోలలో పండిట్ జనాభా ఉంది, విదేశాలకు వెళ్లిన వారు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. ఆ తరువాత దశాబ్దాలలో జమ్మూలో 4,000-5,000 పండిట్ కుటుంబాలకు నివాసం ఉండేందుకు జగ్తీ అని పిలువబడే రెండు-గదుల నివాసాల టౌన్షిప్ నిర్మించబడింది. అదనంగా, జమ్మూ శివార్లలోని పుర్ఖూ, నగ్రోటా సహా ముత్తిలో వందలాది కుటుంబాలు ప్రభుత్వ తాత్కాలిక టౌన్ షిప్స్ లో నివసిస్తున్నాయి.
కాశ్మీర్ లో వారి ఆస్తులు కొందరు అతి చవగ్గా అక్కడ నివసించే ముస్లిం కుటుంబాలకు అమ్మేసుకోగా, కొందరు వాటిని అలాగే వదిలేశారు, కొన్ని ఇళ్లు అక్కడ వున్న స్థానికులు కబ్జా చేశారు. సొంతగడ్డ లేని జాతుల ఇక్కట్లు ప్రపంచ చరిత్రలో అత్యంత దయనీయంగా కనిపిస్తాయి. అలాంటి జీవన్మరణ సమస్యే కాశ్మీరీ పండిట్లది కూడా. పాండిత్యాన్నీ, శాంతినీ ప్రేమించే పండిట్ల చరిత్రలో ఏడు బలవంతపు వలసలు కనిపిస్తాయి. అందులో చివరిది- జనవరి 19, 1990 నాటిదే.
దురదష్టవశాత్తూ భారతదేశంలో పేరుకు హిందువులు మెజార్టీ. కానీ ఈ దేశంలో హిందువులు కలిసికట్టుగా ఏనాడూ కాశ్మీర్ హిందువుల గురించి పోరాడలేదు.. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా ఉన్నది ఒక్క భారతదేశంలో మాత్రమే. అందుకే ఈ దేశంలో హిందువులపై దాడులు జరిగినా, అకృత్యాలు జరిగినా ఏ ప్రపంచ దేశం స్పందించదు. అదే ముస్లింల మీద కానీ క్రిస్టియన్ల మీద గానీ చిన్న దాడి జరిగినా ప్రపంచంలో ఆయా దేశాలు దాని మీద ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతారు. వారి మతం వారికి నేర్పిన కట్టు అటువంటిది.
మరి హిందువులలో? పక్క హిందువు ఎలా పోతే ఏంటి అనే స్వార్థ నిర్లక్ష్యభావం. అందుకే దేశంలో మెజార్టీ ప్రజలుగా వున్నా కొన్ని లక్షల హిందువులు స్వదేశంలోనే మూడు దశాబ్దాలుగా కాందిశీకులుగా దుర్భర జీవితం గడుపుతున్నారు.
భారత దేశ సెక్యులర్ ముఠా ఈ దారుణం మీద ఎంత మౌనం వహించాయో చూడండి. ఇదే ముఠా 2002 లో గుజరాత్ లో జరిగిన సంఘటనకు ఎంత ప్రాధాన్యమిచ్చి ప్రపంచ వ్యాప్తంగా హిందువులను పచ్చి మతోన్మాదులుగా ఎలా చిత్రీకరించిందో గుర్తు చేసుకోండి.
మీలో మీకు ఐక్యత లేనంత వరకు మీకు రక్షణ లేదు. మీరు, మీ సంస్కృతి సర్వనాశనం అయిపోయినా, ఏ దేశం వాడు కనీసం ఒక కన్నీటి చుక్క కూడా మీ కోసం రాల్చడు. కారణం మీకంటూ చెప్పుకునేందుకు మరో దేశం లేదు భారత్ తప్ప.
ఇది నిజం.
Courtesy :- Chada Shastry






