కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగవుతుందా..? అంటే గత ఐదేళ్ల ప్రస్థానాన్ని చూస్తే నిజమేనేమో అనిపిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ సర్వే లెక్కల ప్రకారం. 2016-20 మధ్య కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను చూస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. ఏకంగా 170 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరినట్లు ఓ సర్వే రిపోర్టులో తేలింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రెటిక్ రిఫార్మ్స్ ఈ సర్వేను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లో కూడా జంపింగ్ జిలానీలపై రిపోర్టులు సేకరించింది. బీజేపీ పార్టీలో ఉన్న వారు మాత్రం కేవలం 18 మంది మాత్రమే పార్టీ మారినట్లు పేర్కొంది. అయితే ఇలా పార్టీలు మారిన వారంతా.. ఎన్నికల వేళలోనే పార్టీలు మారారని పేర్కొంది.
ఇలా పార్టీలు మారిన వారిలో 405 మంది తిరిగి పోటీ చేశారని.. అలా చేసిన వారిలో కొంతమంది మాత్రమే గెలుపొందారని పేర్కొంది. ఇలా గెలిచిన వారు కూడా.. 182 మంది బీజేపీలో చేరారని.. 38 మంది కాంగ్రెస్లో చేరారని పేర్కొంది. ఇక 25 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరారని పేర్కొంది. కాగా, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు ఇతర పార్టీలోకి జంప్ చేశారని.. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్బై చెప్పినట్లు తెలిపింది. మొత్తానికి ఈ సర్వే రిపోర్టులను గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు పార్టీలు మారుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇది ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకకతప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.