కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద దేశంలో ఉన్న గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచి నీటి కుళాయి కనెక్షన్ 2024లోగా ఇవ్వడానికి నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ వెబ్ సైట్ ప్రకారం దేశంలో ఆగస్ట్ 15, 2019 నాటికి అంటే ఈ జల జీవన్ మిషన్ ప్రారంభించేనాటికి దేశంలో ఉన్న మొత్తం 19.41 కోట్ల గ్రామీణ గృహాలలో సుమారు 3.24 కోట్ల కుళాయి కన్నెక్షన్స్ అంటే దేశం మొత్తం ఉన్న గ్రామీణ గృహాల్లో 17% ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయి సదుపాయం ఉండేది. ఈ జల జీవన్ స్కీం మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 9.84కోట్ల ఇళ్లకు కుళాయి సదుపాయం వచ్చింది, అంటే సుమారు 52% ఇళ్లకు వచ్చింది. అంటే ఈ 3 సం. లలో 6.60 కోట్ల ఇళ్లకు అంటే 35% గ్రామీణ ఇళ్లకు కొత్తగా కుళాయిలు కనెక్షన్లు ఇచ్చారు. ఈ స్కీం క్రింద ఇప్పటి వరకు 100 జిల్లాల్లో పూర్తిగా ప్రతీ గ్రామీణ ఇంటికి కనెక్షన్ ఇచ్చారు. ఈ ఏడాది బడ్జెట్ లో దీనికోసం 60 వేల కోట్లు కేటాయించారు.
ఈ జల జీవన్ స్కీం లో మరో ముఖ్య విశేషం ఏంటంటే నీటి సదుపాయానికి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి, కొండల మీద, ఎత్తు ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అటువంటి ప్రాధాన్యతా క్రమంలో దేశం సరిహద్దుల్లో కొండల మీద ఉన్న గ్రామాలలో గల ఇళ్లకు కూడా కుళాయి నీటి సదుపాయం ఇప్పటికే కల్పిస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా లేహ్ జిల్లాలో బోర్డర్ (LAC) దగ్గరగా 13,800 అడుగుల ఎత్తులో ఉన్న డెమ్చోక్ గ్రామానికి ఇప్పుడు కుళాయి నీరు చేరుకుంది. ఇదే దేశంలో అత్యధిక ఎత్తులో ప్రజలు నివసిస్తున్న గ్రామం.
వీరికి శీతాకాలంలో నీరు గడ్డ కట్టే ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మంచినీరు దొరకడం చాలా కష్టం అవుతోంది. ఆర్మీ ట్యాంకర్స్ ద్వారా వీళ్ళకి నీరు సప్లై చేస్తూ వుండేవారు. డెమ్చోక్ గ్రామంలోని మొత్తం 38 ఇళ్లకు కుళాయిలు ఏర్పాటు చేయడానికి 325 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్ నగరం నుండి మంచినీటి పైపులు వేసి గ్రామానికి నీటి సదుపాయం కలగచేశారు. తీవ్ర చలికాలంలో ఈ పైపులు లోని నీరు గడ్డకట్టకుండా ఇన్సులేటెడ్ పైపులు ఉపయోగించారు. అలాగే నీరు గడ్డకట్టకుండా పంప్ చేయడానికి 8 సోలార్ పంపులు ఉపయోగించారు.
~ చాడా శాస్త్రి