డీమ్డ్ యూనివర్సిటీల విద్యా వ్యాపారానికి ఇక అడ్డుకట్ట!
దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు ఇచ్చిన ‘యూనివర్సిటీ’ హోదాను రద్దు చేస్తున్నట్లు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యుజిసి ప్రకటించింది. ఇకపై ఆ కాలేజీలు తమ పేరు చివర ‘యూనివర్సిటీ’ అని రాసుకోకూడదని ఆదేశించింది. కొత్తపేరు కోసం మళ్ళీ ఈ కళాశాలలు కేంద్రమానవ వనరుల శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలలో డీమ్డ్ యూనివర్సిటీ హోదా కలిగిన నాలుగు కాలేజీలు దూరవిద్య ద్వారా జారీ చేసిన బిటెక్ (ఇంజనీరింగ్) డిగ్రీలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
యూజీసీ నిర్ణయంతో ‘యూనివర్సిటీ’ హోదా కోల్పోయిన కళాశాలలో విశాఖపట్నంలో గీతం కాలేజీ (గాంధీ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ అండ్’ మేనేజ్ మెంట్), తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, అనంతపురంలోని శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, గుంటూరులోని కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కె.ఎల్. యూనివర్సిటీ), విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ (విట్) ఉన్నాయి.
తీగలాగితే డొంక కదిలినట్లు, డీమ్డ్ యూనివర్సిటీ హోదాతో రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలలో నాలుగు కాలేజీలు కరస్పాండెన్స్ కోర్సు ద్వారా ఇంజనీరింగ్ డిగ్రీలు జారీ చేయడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తంచేస్తూ, వాటితో సహా దేశంలో అన్ని డీమ్డ్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
డీమ్డ్ యూనివర్సిటీ హోదాలో రకరకాల కోర్సులను ప్రవేశపెడుతూ, అవి జారీ చేస్తున్న సర్టిఫికేట్లను అనేక సంస్థలు గుర్తించకపోవడంతో, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చదవుకుని ఆ కోర్సులు పాసైన విద్యార్ధుల భవిష్యత్ శూన్యం గా మారి ఉపాధి లేక విద్యార్థులు, తల్లితండ్రులు లబోదిబోమంటున్నారు.
ఈడీమ్డ్ యూనివర్సిటీల భాగోతాలు సుప్రీం కోర్టు దృష్టికి రావడంతో, వాటిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించినా కారణంగా యుజిసి ఈనిర్ణయం తీసుకుంది. లేకుంటే ఈ కాలేజీల దందా అలా కొనసాగుతుండేది.