బెంగాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదా హింసాకాండ చెలరేగింది.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైనట్టు తెలుస్తోంది. ఫలితాలు వెలువడగానే పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యాలయాలకు తృణమూల్ కార్యకర్తలు నిప్పుపెట్టారు. స్థానిక పార్టీ సానుభూతిపరుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం చేసిన వీడియోలూ వైరల్ అవుతున్నాయి.
ఇక కొందరు మహిళలను జుట్టుపట్టి ఈడ్చుకువస్తున్న వీడియో సైతం వైరల్ అయింది. అయితే ఆ మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగిందని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పలుచోట్ల జరిగిన హింసాకాండ దృశ్యాలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. దుండగులు పిల్లలు, పశుపక్ష్యాదులనూ వదల్లేదని అక్కడి బీజేపీ అధికార ప్రతినిధి అనిల్ బలూనీ ట్వీట్ చేశారు. అందులో గాయాలతో కొందరు యువకులు, పిల్లాపెద్దా పారిపోతుండగా మరికొందరు వారిని తరుముతున్న దృశ్యాలున్నాయి.
ఇక ఆదివారం, సోమవారం ఉదయం కూడా కొన్నిప్రాంతాలు అల్లర్లతో అట్టుడికాయి. ముఖ్యంగా రాజధాని కోల్ కతాలో బీజేపీ సపోర్టర్స్ దుకాణాలు లూటీ చేసిన దృశ్యాలున్నాయి. 24 గంటల్లో ఆరుగురు పార్టీ కార్యకర్తలను హత్య చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారిలో ఒక మహిళ ఉందని తెలిసింది.
బీజేపీకి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న ఇద్దరు మహిళల్ని గ్యాంగ్ రేప్ చేశారని సమాచారం… బీజేపీ సానుభూతి పరుడి ఇంటికెళ్లిన కొందరు దుండగులు అతను లేకుంటే ఆయన కుమార్తె మీద అత్యాచారం చేశారని ఆ ఇంటివాళ్లు ఆరోపిస్తున్నారు. బీజేపీకి ఎన్నికల్లో మద్దతుపలికిన మరికొందరు ఇళ్లల్లోకి వెళ్లి చితకబాదడం, ఇళ్లను, ఇంట్లోని వస్తువులను ద్వంసం చేయడం జరిగిందని స్థానికులే అంటున్నారు.
ఇక మమతా బెనర్జీ ఓడిపోయిన నందిగ్రామ్ లో పరిస్థితి మరింత క్షీణించింది. ఫలితం వెలువడగానే అక్కడి పార్టీ కార్యాలయాన్ని తృణమూల్ కార్యకర్తలు తగులబెట్టారు. అక్కడినుంచి గెలిచిన సువేందు అధికారిని వెంబడించి ఆయనపై రాళ్లదాడి చేశారు. ఈ బీభత్సంలో చాలామంది వణికిపోతున్నారు. ఎక్కడ తమను చంపేస్తారో అని కొందరు ఊళ్లు వదిలి వెళ్లిపోతున్నట్టు తెలిసింది. ఇక కొన్ని జిల్లాల్లో మైనార్టీలుగా ఉన్న ఓ వర్గం వారు బిక్కుబిక్కుమంటూ ఊళ్లే ఖాళీచేసి వెళ్తున్న దృశ్యాలూ బయటకు వచ్చాయి.
ఇంత జరుగుతుంటే టీఎంసీ చీఫ్ మమత కానీ మరేఇతర నాయకులు కానీ కనీసం స్పందించడం లేదు. అంతేకాదు పలువురు ప్రజాప్రతినిధులే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి ప్రధాన మీడియాలో ఎక్కడా ఈ అరాచకకాండ గురించే రాలేదు.
తృణమూల్ కార్యకర్తల చేతిలో దాడులకు గురైన వాళ్లలో మొన్న ఆ పార్టీకి పనిచేసిన కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. తమ పార్టీ కార్యాలయాలను కూడా తృణమూల్ పార్టీ గూండాలు తగులపెట్టారని కమ్యూనిస్ట్ నాయకుడు సీతారాం ఏచూరీ, జెఎన్యూ విద్యార్థి నేతలు ట్విట్టర్ ద్వారా ఖండించారు. దేశంలో ఏ మూల చిన్న ఘటన జరిగినా గగ్గోలు పెట్టే సోకాల్డ్ సెక్యులర్ మేధావులు, హక్కుల కార్యకర్తలు ఇంత జరుగుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదిగ్గా జాతీయవాదులు వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు.
అటు బెంగాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని, అధికారులను కేంద్రం ఆదేశించింది. మరోవైపు, తమ కార్యకర్తలు ముగ్గుర్ని బీజేపీ కార్యకర్తలు చంపేశారని తృణమూల్ అంటోంది. ఆలస్యంగా స్పందించిన మమత… సంయమనం పాటించాలని, బీజేపీ కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఆదివారం నుంచి చెలరేగుతున్న హింసాకాండపై రాష్ట్ర డీజీపీ సహా ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. అల్లర్లను కట్టడి చేయాలని ఆదేశించారు. బెంగాల్ లో ఎన్నికల అనంతరం తమ కార్యకర్తలపై జరుగుతున్న హింసాకాండను బీజేపీ ఖండించింది. నిరసనగా మమతా బనెర్జీ ప్రమాణస్వీకారం చేయనున్న బుధవారం నాడు జాతీయ స్థాయిలో ధర్నాలు చేబడుతున్నట్లు ప్రకటించింది.