పశ్చిమ బెంగాల్లో హింసాత్మకఘటనలు నెలకొన్న తరుణంలో రాజకీయ హింసనుంచి ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా శపథం చేశారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన కోల్ కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన అరాచక కాండను గుర్తుచేసుకుని ఆందోళన చెందారు. బాధ్యతగా ఉండాల్సిన వారే హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇవాళ వారు ప్రమాణ స్వీకారం చేయవచ్చు…అయితే బాధ్యతగల విపక్షంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము ప్రతినబూనామని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో బెంగాల్ హింసను దేశానికంతా తెలియచెప్పుతామన్నారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని నడ్డా అన్నారు.
టీఎంసీ గూండాలు తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.