కర్నాటకలో కరోనా విలయతాండవం చేస్తోంది. అదే సమయంలో పలు ఆస్పత్రులు రోగుల నుంచి భారీగా డబ్బులు పిండుతున్నాయి. ఇక బెంగళూరులోని పలు ఆస్పత్రుల్లో నకిలీ పేర్లతో పడకల్ని రిజర్వ్ చేస్తున్నారు. ఈ స్కాంను బీజేపీ ఎంపీ, యువమోర్చా నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య బయటపెట్టారు. కనీసం 4 వేల 65 పడకల్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారని తేజస్వి ఆరోపించారు. ఆస్పత్రులకు వెళ్లి నిలదీసిన తేజస్వి సూర్య అలాంటి ఆస్పత్రులు, యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప సైతం సీరియస్ అయ్యారు. పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విచారణకు ఆదేశించారు.
ఆ వెంటనే పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఓ మహిళ సహా ఇద్దరు డాక్టర్లు, మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులలో 80 శాతం పడకలను కరోనా రోగులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ అధికారులు కుమ్మక్కు అయినట్టు తెలుస్తోంది.
12 ఆసుపత్రులలో ఒకే రోగి పేరుతో పడకలను బుక్ చేసి అవసరమైన వారికి అత్యధిక ధరలకు అమ్ముకున్నారని తేలింది. బెడ్స్ లేక కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతుంటే ఇలాంటి చర్యలకు పాల్పడడమంటే జనాన్ని హత్య చేసినట్టేనని సూర్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఎంపీ టీం ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో సూర్య, దక్షణ బెంగళూరు ఎమ్యెల్యేలైన రవి సుబ్రమణ్యం, సతీష్ బీబీఎంపీ దక్షిణ జోన్ వార్ గదిలో పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు. ఇక్కడ 17 మంది ముస్లింలు ఉండడాన్నీ ప్రశ్నించారు. కేవలం ముస్లింలకు మాత్రమే పడకలేంటి అని అసహనం వ్యక్తం చేశారు. మీరు మదర్సా కోసమా లేదా సిటీ కార్పొరేషన్ కోసం నియమించారా అని సుబ్రహ్మణ్యం నిలదీస్తే….ఇది హజ్ భవన్ జాబితానా అంటూ సతీష్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు.