పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ బృందం రాష్ట్రానికి చేరుకుంది. మొత్తం నలుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో విచారణ చేపట్టనుంది. ఎన్నికల అనంతర హింసపై తక్షణమే సమగ్ర నివేదిక అందజేయాలని హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వెంటనే నివేదికను పంపని పక్షంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామనీ రాష్ట్ర సర్కారును హెచ్చరించినట్టు తెలిసింది.
అదే సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను కూడా కేంద్ర హోంశాఖ కోరింది. మొన్నటి ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. చాలాచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇక ఇవాళే సాక్షాత్తూ కేంద్ర మంత్రి మురళీధరన్ కారుపై వెస్ట్ మిడ్నాపూర్లో దాడి జరిగింది. దీంతో ఆయన తన రాష్ట్ర పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు. ఈ వివరాల్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆయన ఓ వీడియోను జత చేశారు.
ఇక తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తృణమూల్ గూండాలే తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జి విమర్శించారు.