వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇప్పటికే రెందడు దశల పోలింగ్ ముగియగా.. ఇంకా ఆరు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే అధికార టీఎంసీకి, బీజేపీకి మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. నేతల మధ్య మాటలయుద్ధం జరిగుతుండగా.. ఇక కొన్ని చోట్ల టీఎంసీ శ్రేణులు ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. అయితే ఈ సారి బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. దీదీకి చుక్కలు చూపిస్తున్నారు.
శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సౌత్ 24 పరగణ జిల్లాలోని సోనార్పూర్లో జరిగిన ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఓడి పోవడం ఖాయమని.. నందిగ్రామ్లో కూడా దీదీ ఓటమి పాలవుతుందని జోస్యం చెప్పారు. టీఎంసీ శ్రేణులు మమతా బెనర్జీ వారణాసి నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని బట్టి చూస్తే.. మమతా బెనర్జీ కూడా ఓటమిని అంగీకరించారని మోదీ అన్నారు.
అయితే వారణాసి ప్రజలు.. బెంగాల్ ప్రజలవలె మృధుస్వభావులని.. దయ హృదయం కల్గిన వారని అన్నారు. అయితే మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలు జై శ్రీ రాం అంటే సహించేది కాదని.. జై శ్రీ రాం నినాదం వింటే దీదీకి చిర్రెత్తుతుందని.. మరి వారణాసిలో ప్రతి రెండు నిమిషాలకు ఓ సారి హర హర మహాదేవ్ అంటూ నినాదాలు వినిపిస్తాయని అన్నారు. ఆ నినాదం విన్న తర్వాత ఏం చేస్తావంటూ మమతా బెనర్జీని ఉద్దేశించి ప్రశ్నించారు.