కోవిడ్ థర్డ్ వేవ్ కూడా ఉధృతంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర సర్కారును అప్రమత్తం చేసింది సుప్రీం కోర్టు. ముఖ్యంగా మెడికల్ ఆక్సిజన్ నిల్వల్ని సిద్దంగా ఉంచాలని సూచించింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా విధానాన్ని సమీక్షించుకోవాలంది. డిల్లీకి ఆక్సిజన్ సరఫరాపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి పలు సూచనలు చేసింది.
ఢిల్లీలోని కోవిడ్ రోగులకు రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనా ప్రణాళికను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పరిశీలించింది. రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని ఆదేశించినప్పటికీ, తాము రోజుకు 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేశామని తెలిపింది.సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తూ, ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ను ఉపయోగించే ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో అధ్యయనం జరిగిందని, ఆసుపత్రుల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఆక్సిజన్ నిల్వ ఉంచారనీ చెప్పారు. పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఢిల్లీకి చేరినా పంపిణీ పూర్తి కాలేదని అన్ లోడింగ్ కు సమయం పడుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం రాబోయే మూడో దశమరింత ప్రమాదకరంగా ఉండవచ్చని చెబుతున్నారని… అందుకు ఇప్పుడే సిద్ధమైతే మూడో దశను ఎదుర్కొనగలుగుతామనీ అంది.