అసత్యాలు, అర్ధసత్యాలు ఎన్నాళ్లు కామ్రేడ్?
భారత దేశంలోని కమ్యూనిస్టు నాయకుల ప్రతిభా పాటవాలు అమోఘం. ఈ దేశానికి మంచి చేసే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు నిప్పులు చెరగడం, సమ్మెలు గొడవలు చెయ్యడం కామ్రేడ్లకు అలవాటు. చైనాలో ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. యుగర్ ముస్లింలు కనీసం మనుషులుగా బతికే అవకాశం లేదు. అయినా చైనా ప్రభుత్వం భేష్ అంటారు. ఇక్కడ అపరిమితమైన భావప్రకటన స్వేచ్ఛ ఉన్నా చాలదంటారు.
కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల మీద గయ్యి మని గొడవ చేసే వారిలో కమ్యూనిస్టులు కూడా ముందు వరుసలోనే ఉన్నారు. కొత్త చట్టాల వల్ల మార్కెట్ కమిటీ వ్యవస్థ బలహీనమవుతుందని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న వారి ఆరోపణ. కామ్రేడ్లు కూడా ఇందుకు సై అంటూ ఆందోళనకు జై కొట్టారు. ఇంతకీ వాళ్ల ఏలుబడిలో ఉన్న కేరళలో వ్యవసాయ ప్రాథమిక మార్కెట్ కమిటీల వ్యవస్థ ఉందా? లేనే లేదు. అసలు మండీ వ్యవస్థే లేని కేరళ అధికార పార్టీ సీపీఎం, దాని మిత్రపక్షాలు, మండీలను బలోపేతం చేయాలంటున్న వారికి మద్దతు తెలపడం అంటే అర్థం ఏమిటి? కేరళలో కూడా మార్కెట్లను ఏర్పాటు చేస్తామనా? ఈ మేరకు అక్కడి ప్రభుత్వం అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. మరి మద్దతు వెనుక మతలబు ఏమిటి? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా శుక్రవారం ఇదే ప్రశ్న వేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించ వద్దని కోరారు.
మోడీ చట్టాలు కార్పొరేట్లకు పెద్ద పీట వేస్తాయనే ఆరోపణలో ఏమైనా పస ఉందా? ప్రతి ఉత్పత్తిదారు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుకు మాత్రం ఆ స్వేచ్ఛ లేకుండా సంకెళ్లు వేయడం సబబా? ఇప్పుడు ఆందోళన చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ మండీ ఆధిపత్యం వద్దని, రైతులు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ కావాలని గత 27 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. మరి వేరే చోట్ల ఎందుకు ఆందోళన జరగడం లేదు? తెలంగాణలో ఒక్క రైతు కూడా ఈ చట్టాలు వద్దని రోడ్డెక్కలేదే? సన్న రకం వరికి మద్దతు ధర కోసం మాత్రమే తెలంగాణ రైతులు రోడ్డెక్కిన సంగతి మనకు తెలిసిందే.
కమ్యూనిస్టులు గతంలో కొన్ని అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేశారు. కంప్యూటర్లు అవస్తే ఉద్యోగాలు పోతాయన్నారు. నిరుద్యోగం పెరుగుతుందన్నారు. దీంతో సమ్మెలు బంద్ లు జరిగాయి. కంప్యూటర్లకు వ్యతిరేకంగా కామ్రేడ్లు తీవ్ర స్థాయిలోనే ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇంతకీ వాళ్ల వాదన నిజమేనా? ఇప్పుడు కంప్యూటర్ల వల్లనే ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కమ్యూనిస్టులు తమ ఆఫీసుల్లో కంప్యూటర్లు వాడటం లేదా? అంటే జవాబు చెప్పరు.
పీవీ నరసింహా రావు ఈ దేశాన్ని ఆర్థిక ఊబిలోంచి బయటపడేయడానికి సంస్కరణలు తెచ్చారు. వాటిమీదా కామ్రేడ్లు గయ్యిమన్నారు. వాటి వల్ల దేశం నాశనం అవుతుందనే అసత్యాన్ని ప్రచారం చేశారు. కానీ ఆ సంస్కరణల వల్లే మన దేశం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఇప్పుడు వ్యవసాయ చట్టాల విషయంలోనూ తప్పుడు ప్రచారంతో రైతులను రెచ్చగొడుతున్నారనేది బిజెపి నాయకుల ఆరోపణ. కమ్యనిస్టులు తాము చేయని పని ఇతరులు చేయాలని దబాయించడం ఏమిటో? రైతులు ఈ వాస్తవాలను తెలుసుకోవాలి.